యాదాద్రి, నవంబర్ 6 : యాదాద్రీశుడి దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కార్తిక మాసంతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో స్వయంభూ నారసింహుడి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాఢ వీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలో భక్తుల సందడి నెలకొంది. వీఐపీ, బ్రేక్ దర్శనాల్లో 1,549మంది భక్తులు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ రాని విధంగా వీఐపీ దర్శనాలతో రూ. 17,10,000 ఆదాయం సమకూరింది. స్వామి వారికి ఆదివారం ఒక్కరోజే రూ.85,62,851 ఆదాయం సమకూరడం విశేషం. కొండపైన వాహనాల రద్దీ కొనసాగింది. పార్కింగ్ ప్రాంతంతో పాటు కొండపై వివిధ ప్రాంతాల్లో వాహనాల రద్దీతో భక్తులకు తీవ్ర ఆటంకం కలిగింది. వెంటనే స్పందించిన ఆలయాధికారులు, పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది సమస్యను పరిష్కరించారు. స్వామివారి ధర్మదర్శానికి 6 గంటలు, వీఐపీ దర్శనానికి 4గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు నిర్వహించే సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనం, నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహ హోమం ఘనంగా నిర్వహించారు. అనంతరం మొదటి ప్రాకార మండపంలో నిర్వహించిన స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. కార్తిక మాసం సందర్భంగా కొండ కింద వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రతాలు అధిక సంఖ్యలో నిర్వహించారు. 1,349మంది భక్తులు వ్రత పూజల్లో పాల్గొన్నారని తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటకంగా సాగాయి. స్వామివారిని సుమారు 82వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ. 85,62,851 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వామివారి ఖజానాకు భారీ ఆదాయం రావడం తొలిసారి అని ఆలయాధికారులు తెలిపారు. కార్తిక పౌ ర్ణమి రోజున చంద్రగ్రహణం కావడంతో ఆలయం మూసి ఉంటుందని అధికారులు తెలిపారు.
శ్రీవారిని దర్శించుకున్నహైకోర్టు న్యాయమూర్తి
యాదాద్రీశుడిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం యాదాద్రికి చేరుకున్న ఆమె నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. దర్శన అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందించారు.