నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 6(నమస్తే తెలంగాణ) : అధికార దాహంతో బీజేపీ, డబ్బు గర్వంతో రాజగోపాల్రెడ్డి అక్కర లేకుండా తెచ్చిన ఉప ఎన్నికలో మునుగోడు ప్రజానీకం నీతివైపే నిలిచింది. పైసల మదాన్ని చిత్తు చేస్తూ గులాబీ జెండాను గుండెలకు హత్తుకున్నది. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కుతో కమలనాథులకు గుణపాఠం చెప్పింది. అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న టీఆర్ఎస్ సర్కారుకు జైకొట్టింది. సీఎం కేసీఆర్ కోరినట్టు బీఆర్ఎస్కు గట్టి పునాది రాయి వేసింది. మునుగోడు ఉప ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం బలపర్చిన అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమీప బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై 10,309 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడమే గాక డిపాజిట్ను కూడా దక్కించుకోలేకపోయింది. బీఎస్పీ 4,146 ఓట్లతో నామమాత్ర ప్రభావమే చూపింది. ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో టీఆర్ఎస్ గెలుపొందడంతో మునుగోడు నియోజకవర్గంతోపాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గులాబీ, వామపక్ష శ్రేణుల సంబురాలు మిన్నంటాయి. నల్లగొండ ఆర్జాలబావి కౌంటింగ్ కేంద్రం వద్ద జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్, కంచర్ల భూపాల్రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, యాదాద్రి జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానమైన మునుగోడు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరింది. ఆదివారం వెలువడిన మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి 10,309 ఓట్ల మెజార్టీతో సమీప బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై గెలుపొందారు. ప్రభాకర్రెడ్డికి 97,006 ఓట్లు రాగా రాజగోపాల్రెడ్డికి 86,697 ఓట్లు పోలయ్యాయి. మూడో స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పాల్వాయి స్రవంతికి 23,906 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ 4,146 నామమాత్ర ప్రభావమే చూపింది. మొత్తం 47 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలువగా ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడం ద్వారా వరుసగా మూడు ఉప ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసినైట్లెంది. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎన్నికల చరిత్రలోనే 12కు 12 అసెంబ్లీ స్థానాలను టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుని చరిత్ర సృష్టించింది. మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన టీఆర్ఎస్తో పాటు సీపీఐ, సీపీఎం నేతలు, ప్రజాప్రతినిధులు, శ్రేణులకు ఎన్నికల రథసారధిగా వ్యవహారించిన మంత్రి జగదీశ్రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అభినందించారు. సీఎం కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని ప్రజలు స్పష్టం చేశారని, ధర్మం వైపే మునుగోడు ప్రజలు నిలబడ్డారని మంత్రి వ్యాఖ్యానించారు.
2018 సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన మూడు ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. గతంలో హుజూర్నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన టీఆర్ఎస్ మునుగోడులోనూ సత్తా చాటింది. దీంతో జిల్లాలోని రెండు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలను టీఆర్ఎస్ వశం చేసుకున్నైట్లెంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు మునుగోడు ప్రజలు జై కొట్టారు. దాంతో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి రెండో సారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
ఈ నెల 3న మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ జరుగ్గా ఆదివారం ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. నల్లగొండలోని అర్జాలబావి గోదాముల్లో పటిష్ట భద్రత నడుమ కౌంటింగ్ నిర్వహించారు. పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ ప్రక్రియ మొదలుకాగా సాయంత్రం 8 గంటల వరకు సుధీర్ఘంగా కొనసాగింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతిదీ పక్కాగా సరిచూశాకే ఎన్నికల ఫలితాలను వెల్లడించారు.
తొలి రౌండ్ నుంచే టీఆర్ఎస్ ఆధిక్యం
మునుగోడు నియోజకవర్గంలోని 7 మండలాల్లో మొత్తం 298 పోలింగ్ స్టేషన్లు ఉండగా ఒక్కో రౌండ్లో 21 టేబుళ్లపై మొత్తం 15 రౌండ్లలో లెక్కింపును పూర్తి చేశారు. ఒక్క గంటలో ఒకటి నుంచి రెండు రౌండ్ల లెక్కింపు మాత్రమే పూర్తైంది. తొలుత లెక్కింపును ప్రారంభించిన పోస్టల్ బ్యాలెట్లలోనూ టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యతను కనపరించింది. మొత్తం 686 పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్కు 405 ఓట్లు, బీజేపీకి 211 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 41 ఓట్లు రాగా మిగతా ఓట్లు మరికొందరికి పోలయ్యాయి. దాంతో పోస్టల్ బ్యాలెట్లోనే టీఆర్ఎస్ అభ్యర్ధి 194 ఓట్ల ఆధిక్యతను ప్రదర్శించారు. ఇక తొలిరౌండ్లో మొదలైన ఆధిక్యం రెండు, మూడు రౌండ్లల్లో కొంత మేర తగ్గినా తర్వాత ఎక్కడా తగ్గకుండా క్రమపద్ధతిలో పెరుగుతూ పోయింది. తొలి రౌండ్లోనే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి 1,292 ఓట్ల స్పష్టమైన ఆధిక్యంతో ఖాతా తెరిచారు. చౌటుప్పల్ మండలం నుంచి మొదలైన కౌంటింగ్లో రెండు, మూడో రౌండ్లల్లో మాత్రం బీజేపీ లీడ్ సాధించింది.
రెండో రౌండ్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి 841 ఓట్లను, మూడో రౌండ్లోనూ 36 ఓట్ల స్పల్ప ఆధిక్యతను ప్రదర్శించారు.మూడు రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్రెడ్డి 415 ఓట్ల ఆధిక్యతతో కొనసాగారు. తిరిగి నాల్గవ రౌండ్ నుంచి 14వ రౌండ్ వరకు టీఆర్ఎస్ అభ్యర్థి వెనుదిరిగి చూడలేదు. టీఆర్ఎస్ తన అధిక్యతను అంతకంతకూ పెంచుకుంటూ వెళ్లింది. నాలుగో రౌండ్లో 299 ఓట్లు, ఐదో రౌండ్లో 817, ఆరో రౌండ్లో 638, ఏడో రౌండ్లో 399, 8వ రౌండ్లో 532, 9వ రౌండ్ లో 852, 10వ రౌండ్లో 488, 11వ రౌండ్లో 1,361, 12వ రౌండ్లో 2,000, 13వ రౌండ్లో 1,345, 14వ రౌండ్లో 1,055 ఓట్లును సాధిస్తూ టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. ఇక చివరగా 15వ రౌండ్లోని నాలుగు టేబుళ్లపై మాత్రమే కౌంటింగ్ జరగ్గా ఇక్కడ బీజేపీ 88 ఓట్ల ఆధిక్యతను సాధించింది.
ఇలా మొత్తం 15 రౌండ్లలో కలిపి 10,309 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఘన విజయం సాధించారు. నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉండగా అన్ని మండలాల్లోనూ టీఆర్ఎస్ పార్టీనే ఆధిక్యతను ప్రదర్శించింది. వాస్తవంగా తమకు చౌటుప్పల్, చండూరు మండలాల్లో మంచి మెజార్టీ వస్తుందని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి అంచనా వేసినా ఫలించలేదు. ఈ మండలాల్లోనే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల మంచి మెజార్టీతో ఓట్లను సాధించడంతో బిజేపీ నేతలు ఖంగుతినాల్సి వచ్చింది.
కాంగ్రెస్ పార్టీకి 23,906 ఓట్లు
2018 సాధారణ ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతోనే ఉప ఎన్నిక వచ్చింది. దాంతో ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ఒక సవాల్గానే మారింది. చివరకు మూడో స్థానానికి పరిమితమైంది. మొత్తం 23,906 ఓట్లను ఆ పార్టీ సాధించింది.
గెలుపు ధ్రువీకరణ పత్రం అందుకున్న కూసుకుంట్ల..
ఎన్నికల తుది ఫలితాల అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్కుమార్, పార్టీ నేత నంద్యాల దయాకర్రెడ్డి ప్రభాకర్రెడ్డి వెంట ఉన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి రోహిత్సింగ్, కేంద్ర ఎన్నికల పరిశీలకులు పంకజ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి కౌంటింగ్ కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ మునుగోడు ప్రజలు అభివృద్దిని కోరుకున్నారని, కేసీఆర్తోనే అది సాధ్యమని మరోసారి నిరూపిం చారని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ అండదండలతో జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో మునుగోడును అభివృద్ది మార్గంలో నడిపిస్తానన్నారు. తన గెలుపు కోసం కృషి చేసిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లకు, రాష్ట్ర పార్టీ నేతలకు, అన్ని స్థాయిల్లో పనిచేసిన వారికి, సీపీఐ, సీపీఎం శ్రేణులకు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
అభివృద్ధే ఎజెండా
మునుగోడు అభివృద్ధే నా రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను. ఆగిన అభివృద్ధిని సీఎం కేసీఆర్ నాయకత్వంలో ముందుకు తీసుకుపోతాను. నా గెలుపు కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ, వామపక్ష శ్రేణులకు కృతజ్ఞతలు.