సూర్యాపేట, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ)/ హాలియా : ఉద్యమాల ఖిల్లా నల్లగొండ జిల్లా. ఒకప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోట. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవతరణతో సొంత ఇంటి పార్టీ టీఆర్ఎస్ను జిల్లావాసులు అక్కున చేర్చుకుంటూ వస్తున్నారు. తాజాగా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపుతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 అసెంబ్లీ నియెజకవర్గాలకు పన్నెండు చోట్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిన్నారు. నల్లగొండ రాజకీయ చరిత్రలో ఒక పార్టీ పూర్తిస్థాయి ఆధిక్యం కలిగి ఉండడం ఇదే తొలిసారి. 2018 సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు, మూడు స్థానాలు మినహా మిగతా స్థానాల్లో టీఆర్ఎస్కే జై కొట్టారు. 2018 అనంతరం జిల్లాలో ఎన్నిక ఏదైనా ప్రజలు టీఆర్ఎస్ను ఏకపక్షంగా ఆశీర్వదిస్తున్నారు. 2019లో హుజూర్నగర్, 2021లో జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హేమాహేమీలు ఉత్తమ్పద్మావతి, కుందూరు జానారెడ్డిని ప్రజలు ఓడించి టీఆర్ఎస్ అభ్యర్థుల మెడలో గెలుపు వరమాలను వేశారు. తాజాగా మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డిని ఓడించి, ఆ పార్టీకి ఇక్కడ స్థానం లేదని ప్రజలు తేల్చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపించి టీఆర్ఎస్కు పట్టం గట్టారు.దాంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 నియోజకవర్గాల్లో కారు జోరే కొనసాగుతున్నది. దేవరకొండ- రమావత్ రవీంద్రకుమార్, నాగార్జునసాగర్- నోముల భగత్, మిర్యాలగూడ-నల్లమోతు భాస్కర్, హుజూర్నగర్-శానంపూడి సైదిరెడ్డి, కోదాడ- బొల్లం మల్లయ్యయాదవ్, సూర్యాపేట-గుంటకండ్ల జగదీశ్రెడ్డి, తుంగతుర్తి-గాదరి కిశోర్కుమార్, నల్లగొండ-కంచర్ల భూపాల్రెడ్డి, నకిరేకల్-చిరుమర్తి లింగయ్య, ఆలేరు-గొంగిడి సునీతామహేందర్రెడ్డి, భువనగిరి-పైళ్ల శేఖర్రెడ్డి, మునుగోడు-కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి. ఇలా జిల్లాలోని ఏ నియోజకవర్గం చూసినా అంతా గులాబీమయమే.
అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలు..
నల్లగొండ జిల్లాలో జరిగిన మూడు శాసనసభ ఉప ఎన్నికల్లోనూ చైతన్యవంతమైన జిల్లా ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి అభివృద్ధికి పట్టం కట్టారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఏదో ఒక రూపంలో సంక్షేమం అందని గడప లేదంటే అతిశయోక్తి కాదేమో. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంట్, రైతు బంధు, రైతు బీమా, ధాన్యం కొనుగోలు కేంద్రాలతో మద్ధతు ధరలు, కల్యాణలక్ష్మితో ఆడబిడ్డల పెండ్లి మొదలు.. కేసీఆర్ కిట్, తల్లీబిడ్డలను ఇంటికి సురక్షితంగా చేర్చే మాతశిశు సంరక్షణ వరకు, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, గీత కార్మికులు ఇలా ఏ ఆధారం లేని అభాగ్యులకు పింఛన్ల రూపంలో ఆసరా, పల్లె, పట్టణ ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇంటింటి నుంచి చెత్త సేకరణ, సెగ్రిగేషన్ షెడ్ల ఏర్పాటు ఇలా ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా లబ్ధిదారులకు చేరవేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్కు జిల్లా ప్రజలు అండగా నిలుస్తూ ఆశీర్వదిస్తున్నారు.