యాదాద్రి, జూలై 7 : పాల ఉత్పత్తులను జీఎస్టీ పరిధి నుంచి తొలగించాలని నార్మాక్స్ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి కేంద్ర ప్రభుత్వాని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు జీఎస్టీ పరిధిలో లేని ప్రీప్యాక్డ్ అండ్ ప్రీ లేబుల్డ్ పాల ఉత్పత్తులపై 5 శాతం పన్ను విధించాలని, పాల పదార్థాల తయారీకి ఉపయోగించే యంత్ర సామగ్రిపై 12 శాతం ఉన్న జీఎస్టీని 18 శాతానికి పెంచాలని గత నెల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో నిర్ణయించారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా హయత్నగర్లోని మదర్ డెయిరీ ప్రధాన కార్యాలయంలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో పెరుగు, బటర్ మిల్స్, లస్సీ వంటి పాల ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని, తద్వారా సహకార డెయిరీ, చిన్నపాటి డెయిరీ పరిశ్రమలు నిర్వీర్వమవుతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వ కుట్రను పాడి రైతులందరూ వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.
ఇప్పటికే డీజిల్ ధరలు పెరుగడంతో పాల రవాణా, ముడి పదార్థాలు, యంత్ర సామగ్రి ఖర్చులు, పశుగ్రాసం, దాణా ధరలు పెరిగాయన్నారు. దాంతో పాలు, పాల ఉత్పత్తుల తయారీ ఖర్చులు గణనీయంగా పెరిగాయని తెలిపారు. దేశంలో నూటికి 60 శాతం మంది ప్రజలు వ్యవసాయం అనుబంధ పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక వ్యవసాయంలో నష్టం వాటిల్లితే.. దానికి అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమ రైతులను కాపాడుతూ వారి ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందన్నారు.
దేశ వ్యాప్తంగా సుమారు 9 కోట్ల గ్రామీణ కుటుంబాలు, ప్రత్యేకంగా సన్న, చిన్నకారు రైతులతోపాటు సహకార డెయిరీలను నిర్వీర్యం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలతో పెట్టుబడి భారం మరింత పెరిగి సహకార రంగంలో ఉన్న పాడి పరిశ్రమలు పూర్తిగా మూతపడే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్టీ కారణంతో 60 శాతం చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పాడి రైతులతో కలిసి ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.