నేడు ఆన్లైన్లో ప్రారంభించనున్న విద్యాశాఖ మంత్రి
తొలి విడుత ఉమ్మడి జిల్లాలో 184 మంది టీచర్ల ఎంపిక
రామగిరి, మార్చి 13 : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రైవేట్కు దీటుగా వసతులు కల్పించడంతోపాటు ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు బోధించేందుకు రాష్ట్ర సర్కారు మన ఊరు.. మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల బోధన ప్రవేశపెట్టేందుకు టీచర్లను సన్నద్ధం చేస్తున్నది. ఇందుకోసం రేపటి నుంచి శిక్షణ తరగతులు నిర్వహించనుండగా సోమవారం ఆన్లైన్లో విద్యాశాఖ మంత్రి ప్రారంభోపాన్యాసం చేయనున్నారు. తొలి విడుతలో నల్లగొండ జిల్లాలో 62, సూర్యాపేటలో 60, యాదాద్రిభువనగిరిలో 60 మంది టీచర్లు ఎంపికయ్యారు. ఈ నెల 19 వరకు ఆయా జిల్లా కేంద్రాల్లో తరగతులు కొనసాగనున్నాయి. శిక్షణ పూర్తయిన వారికి సర్టిఫికెట్లు అందించనున్నారు.
వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల పిల్లలందరికీ ఆంగ్లమాధ్యమం అమలు చేయనున్నారు. ఇందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,097 పాఠశాలలను ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆంగ్లబోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఆన్లైన్లో మధ్యాహ్నం 3 గంటలకు ఎంపిక చేసిన ఉపాధ్యా యులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణను ప్రారంభిస్తారు. ఈనెల 15 నుంచి వారం రోజుల పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 182 మంది ఉపాధ్యాయులకు తొలి విడుతగా శిక్షణ కొనసాగించేలా డీఈఓలు ఏర్పాట్లు చేశారు. ఈ బాధ్యతను సమగ్రశిక్ష సెక్టోరియల్ అధికారులకు అప్పగించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో శిక్షణలో ఉత్తమ ప్రతిభచూపి ఉత్తీర్ణులైతే డిజిటల్ సర్టిఫికెట్లు జారీచేసేలా విద్యాశాఖ సన్నద్ధమైంది.
తొలివిడుత 1,097 పాఠశాలల ఎంపిక
ఆంగ్లమాధ్యమానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా తొలివిడుత 1,097 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. నల్లగొండ జిల్లాలో 517, సూర్యాపేట జిల్లాలో 329, యాదాద్రిభువనగిరి జిల్లాలో 251మంది ఉపాధ్యాయులున్నారు. ఈ పాఠశాలలోని ఉపాధ్యాయులకు విడుతల వారీగా ఆంగ్లబోధనపై శిక్షణ ఇచ్చేలా ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆయా జిల్లా కేంద్రంలో ప్రత్యేక వేదికలను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నారు.
ఏర్పాట్లు పూర్తి
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆంగ్లమాధ్యమంలో ఎంపికై పాఠశాలలోని ఉపాధ్యాయులకు తొలి విడుత శిక్షణకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. శిక్షణకు అనుకూలంగా శిక్షణ వేదికలో పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేశారు. శిక్షణకు ఎంపికై టీచర్స్తోపాటు రిసోర్స్పర్సన్లు, అధికారులు కూర్చునేలా 70 నుంచి 80మంది ఒకే పర్యాయం పాల్గొనేలా బెంచీలు, కుర్చీలు సిద్ధం చేశారు. దీనికి ట్రయల్ సైతం డీఈఓల పర్యవేక్షణలో పూర్తిచేసినట్లు సమాచారం. శిక్షణకు ఎంపికైన ఉపాధ్యాయులతోపాటు డీఈఓ, రిసోర్స్పర్సన్లు, అధికారులు అంతా కలిసి తొలి రోజు నేడు రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆన్లైన్లో ప్రారంభించే ఆంగ్లబోధన శిక్షణను ఆ స్క్రీన్స్పై వీక్షిస్తారు. అదే విధంగా పలు అంశాలపై మంత్రి డీఈవోలు, రిసోర్స్పర్సన్స్తో సమీక్ష సహితం నిర్వహించనున్నారు.
శిక్షణ ఇలా…
ఎంపికైన ప్రాథమిక పాఠశాలలోని ఉపాధ్యాయులకు సోమవారం నుంచి వారం రోజుపాటు (ఈనెల 19 వరకు) శిక్షణ కొనసాగుతున్నది. దీనికి డీఈఓలు ఉపాధ్యాయుల జాబితాను విడుదల చేయడంతోపాటు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ కొనసాగనుంది. ఎంపికైన ఉపాధ్యాయుల్లో 30 మంది మెంటర్స్(గైడ్), మరో 30 మంది శిక్షణ పొందే ఉపాధ్యాయులుగా పరిగణిస్తారు. రోజూ నిర్వహించిన శిక్షణపై అప్పటికప్పుడే ఉపాధ్యాయుల సందేహాలను నివృత్తి చేయనున్నారు. శిక్షణ అనంతరం రోజు వారికి వర్క్షీట్లు అందిస్తారు. ఆయా అంశాలపై ఉపాధ్యాయులు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఉత్తీర్ణసాధించిన ఉపాధ్యాయులకు డిజిటల్ సర్టిఫికెట్లు జారీచేస్తారు.