మహా పూర్ణాహుతి, దేవతోద్వాసన, దోపోత్సవం
నేడు శత ఘటాభిషేకంతో ఉత్సవాలు పరి సమాప్తం
యాదాద్రి, మార్చి 13 : పంచావతార మూర్తి నృసింహుడి తిరు కల్యాణోత్సవం అనంతరం శ్రీచక్ర ఆళ్వార్లకు పుణ్యతీర్థ స్నాన ఘట్టాన్ని అర్చకులు అంగరంగ వైభవంగా జరిపారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదో రోజు ఆదివారం లోక కల్యాణం, విశ్వశాంతి నిమిత్తం సుదర్శన చక్ర ఆళ్వార్ల చక్రతీర్థ స్నానాలు, మహా పూర్ణాహుతి పూజలు పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు కల్యాణ లక్ష్మీనరసింహులకు పుష్పయాగం, దేవతోద్వాసన, దోపోత్సవాలను శాస్ర్తోక్తంగా జరిపించారు. బాలాలయం ఉత్సవ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెండి గంగాళంలో వేద మంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య చక్రతీర్థ స్నాన ఘట్టం కనుల పండువగా సాగింది.
ముక్కోటి దేవతలు అహూతులుగా లోక కల్యాణం కోసం నిర్వహిస్తున్న స్వామి, అమ్మవార్ల తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో శ్రీచక్ర ఆళ్వార్ల పుణ్యతీర్థ స్నాన ఘట్టం శాస్ర్తోక్తంగా, ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు బాలాలయంలో కల్యాణ లక్ష్మీనృసింహులను దివ్యమనోహరంగా ఆలంకరించి ప్రత్యేక వేదికపై అధిష్ఠించారు. ఆలయ ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం, పారాయణీకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణలు, వేద, ప్రబంధ పారాయణాల మధ్య ఆగమశాస్త్రరీతిలో చేపట్టారు. వెండి గంగాళంలో పవిత్ర జలంతో లక్ష్మీసమేతుడైన యాదాద్రీశుడు స్నానమాచరిస్తున్న సమయంలో భక్తుల జయ జయ హర్షధ్వానాల మధ్య బాలాలయం మార్మోగింది. యాదాద్రి వాసా, యాదగిరీశా, గోవిందా గోవిందా అంటూ యాదాద్రి కొండ పిక్కటిల్లింది.
నేటితో ఉత్సవాలు పరిసమాప్తి..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం అర్చకులు పరిసమాప్తి పలుకనున్నారు. ఉదయం 10 గంటలకు శ్రీస్వామివారి అష్టోత్తర శత ఘటాభిషేకం, రాత్రి 9 గంటలకు శ్రీస్వామివారి శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.
వైభవోపేతంగా మహా పూర్ణాహుతి..
లోక కల్యాణం, విశ్వశాంతి కోసం ముక్కోటి దేవతల సమక్షంలో నిర్వహించిన నిత్య యాగ పూజల్లో ఆదివారం మహాపూర్ణాహుతి జరిపారు. ఉత్సవ పరిసమాప్తిగా ఆయా దేవతల మంత్రపఠనాలతో యజ్ఞహవిస్సును అందజేసి యాగ పరిసమాప్తి కోసం మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా యజ్ఞాచార్యులు, అర్చక బృందం పాంచరాత్రాగమశాస్త్ర రీతిలో ఆలయ యాగశాలలో చతుస్థానార్చన పూజలు జరిపి వేదమంత్రాలతో మహాపూర్ణాహుతిని నిర్వహించారు. బ్రహ్మోత్సవ సమయంలో ఏర్పడిన సకల దోషాలను తొలగించడానికి పరిపూర్ణుడైన పరమాత్ముడిని ప్రార్థించి, నిత్య హవిస్సులను అందించిన అగ్నిదేవుడిని ప్రసన్నం చేసుకునే వేడుక మహాపూర్ణాహుతి పర్వమని ఆలయ ప్రధానార్చకులు నల్లంథీఘళ్ లక్ష్మీ నరసింహాచార్యులు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈఓ ఎన్. గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, మోహనాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, చింటపట్ల రంగాచార్యులు, బట్టర్ సురేంద్రాచార్యులు, మరింగంటి శ్రీధరాచార్యులు, ఆలయ ఏఈఓ గజవెల్లి రమేశ్బాబు, గట్టు శ్రవణ్కుమార్, దోర్బల భాస్కర్శర్మ, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
స్వామివారికి పుష్పయాగం.. దేవతోద్వాసన.. దోపోత్సవం..
సకలలోక పాలకుడు, అవతారమూర్తి యాదాద్రి లక్ష్మీనరసింహులకు వివిధ రకాల పూలతో సహస్రనామ పారాయణాలతో శ్రీపుష్పయాగం సంప్రదాయరీతిలో నిర్వహించారు. అతివృష్టి, అనావృష్టి లేకుండా సుభిక్షత కోసం శ్రీదేవీ భూదేవీ సహితుడైన స్వామివారిని సకల పుష్పరాజములతో అర్చించారు. అనంతరం దేవతోద్వాసన, దోపోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
తిరుమంగయాళ్వారు చరిత్రే దోపోత్సవం..
బ్రహ్మోత్సవాల్లో ఆలయ సంప్రదాయనుసారంగా తిరుమంగయాళ్వారు చరిత్రనే దోపోత్సవంగా నిర్వహించనున్నట్లు ప్రధానార్చకులు పేర్కొన్నారు. సర్వ సంపదలు భగవంతుడికి చెందవలసినవని, భగవానుడి అనుగ్రహం వల్ల వాటికి చరితార్థత కలుగునని పరమ భక్తుడు తిరుమంగయాళ్వారు తెలియజేశారని అన్నారు. త్రికరణ శుద్ధిగా భగవదర్పణ బుద్ధితో మనం ఆచరించే కర్మలు, దానధర్మాలు పరమాత్మ స్వీకరించగలడని, తద్వారా ముక్తికలుగునని ఈ వేడుకలోని అంతరార్థం అని వివరించారు.
దోషాల పరిహారార్థం చేసే ప్రక్రియే చక్ర తీర్థ వేడుక..
‘దీక్షాంతః అవభృధ’ అని ఉత్సవాంతమునందు సర్వవిధ దోషముల పరిహారార్థం చేసే విశిష్ట ప్రక్రియే చక్రతీర్థ వేడుక అని ఆలయ ప్రధానార్చకులు తెలిపారు. శ్రీవారి ఉత్సవమూర్తుల అలంకారసేవను శ్రీచక్రత్తాళ్వార్ యుక్తంగా మేళ, తాళాలతో, వేదఘోషతో ఆహ్వానింపజేసి శ్రీచక్ర ఆళ్వారును బాలాలయంలో పవిత్ర మంత్ర పూజా జలాలతో అభిషేకిస్తామని చెప్పారు. ఆ తీర్థ రాజములను భక్తకోటి శిరస్సులపై సంప్రోక్షణ గావిస్తామని, బ్రహ్మోత్సవాల్లో ఈ వేడుకకు ఎంతో ప్రత్యేకత ఉంటుందని అలయ అర్చకులు వివరించారు.
పుష్పాలతో శ్రీస్వామివారిని అర్చించే వేడుకే ‘శ్రీపుష్ప యాగం’ బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే అత్యంత విశిష్టమైన ఉత్సవమే శ్రీపుష్పయాగం. సహస్రనామాలతో వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అర్చించే వేడుకయే పుష్పయాగమని ప్రధానార్చకులు వివరించారు. ఆగమశాస్ర్తానుసారంగా అతివృష్టి, అనావృష్టి, దుర్భిక్షబాధలు లేకుండా సర్వవిధ ఉపద్రవ ఉపశమనాత్మకంగా ఈ వేడుకను నిర్వహించుట సంప్రదాయమని వెల్లడించారు.
దేవతలను తిరిగి పంపించే వేడుకే దేవతోద్వాసన…
స్వామివారి బ్రహ్మోత్సవాలకు సూక్ష్మ శరీరాలతో విచ్చేసి, ఆద్యంతం తిలకించి శ్రీస్వామి, అమ్మవార్లను సేవించి ఆనంద భరితులైన దేవతారుషిగణాలను, సనక సనందనాది యోగీశ్వరులను ఉత్సవాంతంలో వైదికమంత్ర పూరితంగా తిరిగి వారిని స్వస్థలాలకు పంపించే వేడుకే దేవతోద్వాసన అని అర్చకులు వివరించారు. భక్తి శ్రద్ధలతో, వైదిక మంత్ర పఠనాలతో ఈ దేవతోద్వాసన వేడుక నిర్వహించుట ఆగమ సంప్రదాయం అని అన్నారు.