శ్రీవారిని ఖజానాకు రూ.23,60,480
యాదాద్రి, మార్చి 13 : యాదాద్రి లక్ష్మీనృసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాలతో పాటు ఆదివారం సెలవుదినం కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో స్వామివారి ప్రాంగణం రద్దీగా మారింది. వీఐపీ దర్శనానికి రెండు గంటలు, ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. తెల్లవారుజామున నిజాభిషేకంతో స్వామివారికి ఆరాధనలు ప్రారంభమయ్యాయి. సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పిన అర్చకులు శ్రీలక్ష్మీసమేత నరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేపట్టారు. మండపంలో అష్టోత్తర పూజలు, శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం జరిపారు. శ్రీవారి ఖజానాకు ఆదివారం రూ. 23,60,480 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత వెల్లడించారు. బాలాలయంలో స్వామివారిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు స్వామి వారి వేద ఆశీర్వచనం అందించారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి హుండీ లెక్కింపు ఈ నెల 15న ఉదయం 8 గంటలకు కొండపైన గల హరితభవన్లో లెక్కించనున్నట్లు ఈఓ ఎన్. గీత తెలిపారు.