యాదాద్రి, జూన్ 12 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామివారి స్వయంభూ దివ్యక్షేత్రం ఆదివారం భక్తజనం సంద్రంగా మారింది. వరుస సెలవులు రావడంతో హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఒక్కరోజే దాదాపుగా 50 మందికి పైగా భక్తులు స్వామివారి దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల అర్జిత పూజలు, స్వయంభూ దర్శనాలతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. కొండపై క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల వద్ద నిలబడడానికి సందులేనంతగా కిటకిటలాడాయి. కొండకింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణీలో భక్తుల సందడి నెలకొన్నది.
ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారి నిత్యారాధనలతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సువర్ణపుష్పార్చన, వేద ఆశీర్వచనాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. తెల్లవారుజామున నిజాభిషేకంతో పాటు సాయంత్రం జరిగిన వెండి మొక్కు జోడు సేవల్లో భక్తులు పాల్గొని తరించారు. స్వయంభూ పంచనారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. స్వామివారి వీఐపీ దర్శనానికి రెండు గంటలు, ధర్మ దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. కొండకింద దీక్షా పరుల మండపంలో వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
స్వామివారికి నిత్సోత్సవాలు తెల్లవారు జాము 3 గంటల నుంచి మొదలయ్యాయి. స్వామివారికి సుప్రభాతంలో మేల్కొలిపిన అర్చక బృందం తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించి, స్వయంభూ మూర్తులకు అభిషేకం జరిపారు. అనంతరం శ్రీస్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన చేపట్టారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్భార్ సేవ చేపట్టారు. రాత్రి 7.00 గంటల నుంచి ఆరగంట పాటు శ్రీస్వామివారికి తిరువారాధన నిర్వహించిన అనంతరం స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామి వారికి సహస్రనామార్చన నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యారాధనలు అత్యంత వైభవంగా సాగాయి. ప్రధానాలయంలో పాటు పాతగుట్ట ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. శ్రీవారి ఖజానాకు రూ. 53,30,741 ఆదాయం సమకూరిందని ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు తెలిపారు.
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామివారి ప్రధానాలయంలో మూడ్రోజులుగా సాగుతున్న నమ్మాళ్వారు తిరు నక్షత్ర ఉత్సవాలకు ఆదివారం ప్రధానార్చక బృందం, పారాయణ దారులు ముగింపు పలికారు. చివరిరోజు ఉదయం నమ్మాళ్వారుకు అభిషేకంతో పాటు తిరుమంజనం నిర్వహించారు. దివ్య ప్రబంధ పారాయణం గావించి మధ్యాహ్నం రాజభోగం అనంతరం సమాప్తి పలికారు. సాయంత్రం స్వామివారి ప్రధానాలయంలో పురప్పాట్ సేవను నిర్వహించారు. స్వామివారి, నమ్మాళ్వార్ విగ్రహాలను ఎదురెదురుగా ఉంచి సేవను చేపట్టారు. పారాయణ దారులతో దివ్య ప్రబంధ పాశురాళ్లు పఠించి ఉత్సవాలకు ముగింపు పలికారు.
యాదాద్రీశుడికి రాష్ట్ర సివిల్ సప్లయ్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కుటుంబ సమేతంగా వేర్వేరుగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ సతీసమేతంగా దర్శించుకున్నారు. ఉదయం యాదాద్రికి చేరుకున్న ఏపీ మంత్రి స్వయంభూ పంచనారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం మంత్రికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందివ్వగా, ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
ప్రధాన బుకింగ్ ద్వారా 5,84,950
వీఐపీ దర్శనాలు 10,65,000
వేద ఆశీర్వచనం 12,600
నిత్య కైంకర్యాలు 1,900
సుప్రభాతం 3,400
క్యారీబ్యాగుల విక్రయం 40,000
వ్రత పూజలు 2,15,200
కల్యాణకట్ట టిక్కెట్లు 74,000
ప్రసాద విక్రయం 19,66,890
వాహన పూజలు 21,900
శాశ్వత పూజలు 27,500
అన్నదాన విరాళం 1,07,495
సువర్ణ పుష్పార్చన 1,76,232
లక్ష్మీ పుష్కరిణి 800
యాదరుషి నిలయం 87,000
పాతగుట్ట నుంచి 84,170
వాహనాల అనుమతి 4,75,000
లీసెస్,లీగల్ 3,16,004
ఇతర విభాగాలు 70,700