ఒకప్పుడు ఊళ్లళ్లో గుంట భూమి లేని వారు కాలం చేస్తే అంతిమ సంస్కారాలు అనేవి ఆ కుటుంబాన్ని మరింత కుంగదీసేవి. ఖననానికైనా, దహనానికైనా జాగ లేక నానా యాతన పడాల్సి వచ్చేది. గౌరవంగా సాగాల్సిన చివరి మజిలీ దయనీయంగా ఉండేది. స్వరాష్ట్రంలో ఆ కష్టాలను గట్టెక్కించేందుకు గ్రామగ్రామాన వైకుంఠధామాలను ఏర్పాటుచేసిన రాష్ట్ర ప్రభుత్వం వసతుల కల్పనపైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. రెండు దహన వాటికలు, స్నానాల గదులు, ప్రహరీ, పార్కింగ్, గ్రీనరీ వంటి వసతులతో జిల్లావ్యాప్తంగా 418 నిర్మాణాలను అందుబాటులోకి తెచ్చింది.
అందుకోసం రూ.52.55 కోట్లు వెచ్చించింది. తాజాగా వైకుంఠధామాల్లో నీటి వసతికి ఇబ్బందుల్లేక మిషన్ భగీరథ పైప్లైన్ కనెక్షన్లు ఇస్తున్నది. విద్యుత్ సౌకర్యం కల్పించే దిశగానూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జూన్ 18లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు డీఆర్డీఓ ఉపేందర్రెడ్డి తెలిపారు.
యాదాద్రి భువనగిరి, మే 30(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జీవించినంత కాలం గౌరవంగా బతికిన మనిషి చివరి మజిలీని ప్రశాంతంగా నిర్వహించేందుకు అనువైన పరిస్థితులు చాలావరకు పల్లెల్లో గత ప్రభుత్వాల హయాంలో కరువయ్యాయి. నిన్న మొన్నటివరకు కొన్నిచోట్ల కొన్ని కులాల వారికి మాత్రమే శ్మశాన వాటికలు ఉండేవి. ఇతర కులాల వారు చనిపోయిన సందర్భంలో దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఎన్నో అభ్యంతరాలు ఉండేవి. కొన్ని గ్రామాల్లో గొడవలు సైతం జరిగిన ఉదంతాలు ఉన్నాయి. విధిలేని పరిస్థితుల్లో అంత్యక్రియలను పొలం గట్ల వెంట, ఊరి శివార్లలో ఎక్కడ పడితే అక్కడే చేసేవారు.
ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించాలని సంకల్పించారు. ప్రహరీ, పార్కింగ్, స్నానాలు చేసేందుకు వీలుగా వసతులు, రెండు దహన వాటికలతోపాటు పచ్చదనం వంటి సదుపాయాల కల్పనకు ఒక్కో నిర్మాణానికి ప్రభుత్వం రూ.12.60 లక్షలను వెచ్చించింది. భూదాన్ పోచంపల్లి మండలంలో హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న ఒక్క పంచాయతీ, భువనగిరి మండలంలో ముంపునకు గురవుతున్న రెండు పంచాయతీల్లో మినహా మిగిలిన అన్నిచోట్లా నిర్మాణాలు పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. కొన్నిచోట్ల గ్రామస్తులు అనేకమంది స్వచ్ఛందంగా సాయం చేసేందుకు ముందుకు రావడంతో ఫ్రీజర్లు, శవాలను తీసుకెళ్లడానికి ప్రత్యేక వాహనాలు సైతం సమకూరాయి.
దహన సంస్కారాలు చేసిన చోట నీటి సదుపాయం లేక అంత్యక్రియలకు హాజరైన వారు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఈ పరిస్థితుల నేపథ్యంలో వైకుంఠధామాలన్నింటికీ నీటి సౌకర్యం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆరంభంలోనే ఆదేశాలిచ్చింది. మిషన్ భగీరథ ద్వారా నీటి కనెక్షన్ ఇవ్వాలని స్పష్టం చేసింది. కొన్ని వైకుంఠధామాలు గ్రామాలకు దూరంగా ఉండడం అక్కడివరకు భగీరథ పైపులైన్ లేని ప్రాంతాల్లో బోర్లు వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇటీవల జిల్లా కలెక్టర్లతో పల్లె, పట్టణ ప్రగతిపై నిర్వహించిన సమీక్షలోనూ సీఎం కేసీఆర్ దీనిపై దిశానిర్దేశం చేశారు.
ఈ మేరకు సంబంధిత అధికారులు జిల్లాలో అన్ని వైకుంఠధామాలకు తాగునీరు, విద్యుత్ కనెక్షన్ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలో 276 వైకుంఠధామాలకు మిషన్ భగీరథ కనెక్షన్లు ఇచ్చారు. ఇంకా 145 నిర్మాణాలకు ఇవ్వాల్సి ఉంది. అలాగే 163 వైకుంఠధామాలకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వగా మిగిలిన 258 నిర్మాణాలకు ఇవ్వాల్సి ఉంది. పల్లె ప్రగతి కార్యక్రమం జూన్ 3 నుంచి ప్రారంభమై 15 రోజులపాటు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో కార్యక్రమం ముగింపు నాటికి అంటే జూన్ 18 వరకు అన్ని వైకుంఠధామాలకు మిషన్ భగీరథ, విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేలా ఆయా శాఖల అధికారులు కసరత్తు చేస్తున్నారు.
జిల్లాలో 418 వైకుంఠధామాలను అన్ని వసతులతో అందుబాటులోకి తెస్తున్నాం. వీటిలో కొన్నింటికి మిషన్ భగీరథ, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం కూడా పూర్తయ్యింది. మిగిలిన వాటికి జూన్ 18 లోపు కల్పించేందుకు కార్యాచరణ మొదలైంది. మిషన్ భగీరథ పైపులైన్ లేనిచోట బోరు వేసి నీరందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి సకాలంలో అన్ని పనులను పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటాం.
-ఉపేందర్ రెడ్డి, డీఆర్డీఓ, యాదాద్రి భువనగిరి జిల్లా