గోదావరి, మూసీ పరీవాహక ప్రాంతం వెంట ఉన్న చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. జూన్ నెలలో విస్తారంగా వర్షాలు కురియనుండడంతో నీటి వనరుల్లో చేపల పెంపకానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. నీలి విప్లవం పేరుతో ఏటా ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తుండగా, ఈ ఏడాదికీ ఏర్పాట్లు మొదలుపెట్టింది. జిల్లాలో నీటి వసతి ఉన్న వెయ్యికిపైగా చెరువుల్లో 3.16 కోట్ల చేప పిల్లలను వదిలేందుకు జిల్లా మత్స్యశాఖ ప్రణాళిక రూపొందించింది. అందుకుగానూ ప్రభుత్వం కోటికి రూపాయలకుపైగా వెచ్చిస్తున్నది. చేప పిల్లలను ఉచితంగా అందించి చెరువుల్లో సైతం వదులనుండడంతో జిల్లాలోని 144 మత్స్య పారిశ్రామిక సంఘాల పరిధిలోని 8,929 కుటుంబాలు ఈ ఏడాది పొడవునా ఉపాధి పొందనున్నాయి.
మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతి ఏటా నూరు శాతం సబ్సిడీతో చేప పిల్లలను జలాశయాల్లో వదులుతున్నది. 2018-19లో 99 లక్షల చేపపిల్లలు, 2019-20లో 2.15 కోట్ల చేపపిల్లలు, 2020-21లో 2.20 కోట్ల చేపపిల్లలు, 2021-22లో 3.15 కోట్ల చేప పిల్లలను మత్స్యశాఖ చెరువుల్లో వదలగా, ఈ ఏడాది 3.16 కోట్ల చేప పిల్లలను వదులనున్నది. 80-100 ఎంఎం సైజుగల 1.14కోట్ల చేప పిల్లలను, 35-40 ఎంఎం సైజుగల 2.02కోట్ల చేప పిల్లలను వదిలేందుకు రూ.కోటికి పైగా వెచ్చిస్తుంది. నీలి విప్లవం పేరుతో ఎన్నో పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాదీ చేప పిల్లలను పూర్తి సబ్సిడీపై అందించనుండడంతో మత్స్య కార్మిక కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
– యాదాద్రి భువనగిరి, మే 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు కలిపి 1,224 వరకు ఉన్నాయి. వీటిలో 161 పెద్ద చెరువులు కాగా.. 1,043 చిన్న చెరువులు, మూసీ పరీవాహక ప్రాంతం వెంట మరో 20 వరకు చెరువులు ఉన్నాయి. మూసీతోపాటు గత రెండేండ్ల నుంచి జిల్లాలోని పలు ప్రాంతాలకు గోదావరి జలాలు అందుబాటులోకి వచ్చాయి. గతేడాది కురిసిన వర్షాలకు ఇప్పటికే చాలా వరకు చెరువులు జలకళ సంతరించుకున్నాయి. జూన్లో కురిసే వర్షాలకు 80 శాతానికి పైగా నీరు వచ్చి చేరే చెరువుల్లో గతేడాది మాదిరిగానే చేప పిల్లలను వదిలేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 134 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, 10 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో 8,929 మంది సభ్యులు ఉన్నారు. వారితోపాటు గ్రామ పంచాయతీ చెరువుల పరిధిలో ఉన్న నాన్ సొసైటీ సభ్యులకు సైతం నీలి విప్లవం ఫలాలు అందనున్నాయి.
జిల్లాలో కొత్తగా మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఆసక్తి గల వారి నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించిన అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. 18 ఏండ్లు నిండిన వారు అర్హులు కాగా, వల విసరడం, ఈత కొట్టడం, తెప్పలు నడపడం వంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కమిటీలో ఉన్న జిల్లా మత్స్యశాఖ అధికారి, జిల్లా సంఘం అధ్యక్షుడు, ముగ్గురు అనుబంధ శాఖల అధికారులు అర్హులైన వారిని సభ్యులుగా ఎంపిక చేస్తారు. ఇప్పటివరకు కొత్తగా 30 సంఘాలను ఏర్పాటు చేసి 700 మందికి సభ్యత్వం కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు.
చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను వదులుతున్న నేపథ్యంలో మత్స్య ఉత్పత్తి సైతం గణనీయంగా పెరుగుతూ వస్తున్నది. చేపల వేట ద్వారానే సుమారు రూ.56 కోట్లకు పైగా ఆదాయాన్ని మత్స్య కార్మికులు అందిపుచ్చుకుంటూ వస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో సభ్యుడికి రూ.69 వేల చొప్పున లబ్ధి కలుగుతున్నది. ఈ ఏడాది కూడా ప్రతి సభ్యుడు అదే స్థాయిలో ఆదాయం పొందేలా చేయూత కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన చేపలు కోల్కతా, బెంగళూరు తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. హైదరాబాద్ చెంతనే ఉండడంతో చేపలను విక్రయించుకునేందుకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ ఏడాది చెరువుల్లో చేపపిల్లలను వదిలేందుకు ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు పిలిచాం. ఈ నెల 31న టెండర్లు తెరువనున్నాం. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఉచితంగా మత్స్య కార్మికులకు పంపిణీ చేసి విడుతల వారీగా చెరువుల్లో వదలనున్నాం. అలాగే సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా మత్స్య కార్మికులకు చేపల యూనిట్ నిర్మాణాలు, ఐస్ ప్లాంట్ల నిర్మాణం, వాహనాలను సబ్సిడీపై అందిస్తున్నాం. చేపలను విక్రయించేందుకు మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. మహిళా మత్స్యకార సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ సమకూర్చి ఆర్థిక పరిపుష్టికి తోడ్పడేలా చర్యలు చేపడుతున్నాం. మత్స్యకార్మికులు ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం చేయూతనిస్తోంది. ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకుని మత్స్యకార్మికులు ఆర్థికంగా ఎదుగాలి.
-ఎం.రాజారాం, జిల్లా మత్స్యశాఖ అధికారి, యాదాద్రి భువనగిరి జిల్లా
గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా రొయ్యల పెంపకం చేపట్టేందుకు జిల్లా మత్స్యశాఖ దృష్టి సారించింది. బీబీనగర్, జైనపల్లి, మునివంపుల, తంగేడువనం, తుమ్మలగూడెం, బొల్లేపల్లి, మొగలిపాక తదితర 9 చెరువుల్లో రొయ్యల పెంపకాన్ని చేపట్టారు. ఈసారి అదనంగా మరో ఆరు చెరువుల్లో 12 లక్షల రొయ్య పిల్లలను వదిలేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఫలితంగా పల్లె, పట్టణవాసులకు తక్కువ ధరకే రొయ్యలు దొరుకుతున్నాయి.