యాదాద్రి, మే 26 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో గురువారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు చేశారు. పాంచరాత్రగమ శాస్త్రం ప్రకారం సుమారు 2గంటల పాటు లక్ష పుష్పార్చన పూజా పర్వాలు కొనసాగాయి. లక్ష పుష్పార్చనలో దేవస్థాన ఉప ప్రధానార్చకులు, వేద పండితులు, అర్చక బృందం, పర్యవేక్షకులు పాల్గొన్నారు.
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో అర్చకులు నిత్య పూజలు కోలాహలంగా నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు చేసి భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. ప్రధానాలయ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవం జరిపించారు. కొండపైన పర్వతవర్ధినీ రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన చేశారు. కొండ కింద లక్ష్మీపుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానం ఆచరించి సంకల్పంలో పాల్గొన్నారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చనలు నిర్వహించారు. యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాతగుట్ట ఆలయంలో స్వామి నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. అన్ని విభాగాలు కలుపుకుని స్వామి ఖజానాకు రూ.19,26,044 ఆదా యం సమకూరిందని ఈఓ ఎన్.గీత తెలిపారు.
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ఈఓ ఎన్.గీత తొమ్మిది రోజుల పాటు సెలవుపై వెళ్లారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఈఓ సెలవుపై వెళ్లినట్లు సమాచారం. అప్పటి వరకు ఇన్చార్జి ఈఓగా దేవాదాయ, ధర్మాదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు గురువారం విధుల్లో చేరారు.
శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్రెడ్డి సతీసమేతంగా దర్శించుకున్నారు. గురువారం సాయంత్రం యాదాద్రికి చేరుకున్న ఆయన స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ప్రాకారంలోని అద్దాల మండపం వద్ద అర్చకులు వేదాశీర్వచనం ఇవ్వగా, ఆలయ ఏఈఓ గట్టు శ్రవణ్కుమార్ స్వామివారి ప్రసాదం అందించారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 2,33,950
వీఐపీ దర్శనం 97,500
వేద ఆశీర్వచనం 14,400
నిత్యకైంకర్యాలు 8,600
సుప్రభాతం 1,500
క్యారీబ్యాగుల విక్రయం 12,650
వ్రత పూజలు 1,52,800
కళ్యాణకట్ట టిక్కెట్లు 36,000
ప్రసాద విక్రయం 7,59,950
వాహనపూజలు 11,400
అన్నదాన విరాళం 80,914
శాశ్వత పూజలు 60,000
సువర్ణ పుష్పార్చన 1,09,200
యాదరుషి నిలయం 69,180
పాతగుట్ట నుంచి 37,230
కొండపైకి వాహన ప్రవేశం 2,25,000
లక్ష్మీపుష్కరిణి 1,800
గోపూజ 800