యాదాద్రి, ఆగస్టు 10 : యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి నిత్య తిరుకల్యాణోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. సుమారు గంటన్నర పాటు కల్యాణతంతు జరిపించారు. ఉదయం 7.15గంటలకు ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన హోమంతో శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వేంచేపు చేసి మండపంలో ఊరేగించారు.
లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరుకల్యాణ తంతు జరిపించారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి భక్తులకు అభిముఖంగా అధిష్ఠించి నిత్య కల్యాణ తంతు నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పారు. అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు.
సాయంత్రం వేళలో స్వామివారి వెండి మొక్కు జోడు(విహార) సేవ, దర్భార్ సేవ వైభవంగా చేపట్టారు. రాత్రి 7గంటలకు స్వామివారి తిరువరాధన చేపట్టి, స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన జరిపారు. కొండపై ఉన్న పర్వతవర్ధినీ రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.12,76,681 ఆదాయం వచ్చిందని ఈఓ గీత తెలిపారు.
శ్రావణమాసం సందర్భంగా యాదగిరిగుట్టలో చేపడుతున్న ‘శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన’ వైభవంగా కొనసాగుతున్నది. బుధవారం అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొన్న భక్తులకు ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనర్సింహాచార్యులు అమ్మవారి కుంకుమ, స్వామివారి శెల్లా, కనుము, ప్రసాదం అందించారు. అమ్మవారికి శక్తిని ఆపాదించేందుకు చేపట్టిన ఈ మహాకార్యం ఈ నెల 27వరకు కొసాగుతుందని ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనర్సింహాచార్యులు తెలిపారు.
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ప్రధానాలయం వెయ్యేండ్లు వర్థిల్లే విధంగా పునర్నిర్మాణం పూర్తి చేసుకుని, ఈ ఏడాది మార్చి 28న స్వయ ంభూ పంచనారసింహుడి పునఃదర్శనం భక్తులకు కలిగింది. స్వయంభువుగా వెలిసిన స్వామిని మహదానందంతో భక్తులు దర్శించుకుని పులకించిపోతున్నారు. స్వామివారి పునః ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా ఆరేండ్ల కాలంలో స్వామివారికి సంవత్సరానికి కోటి చొప్పున నామాలను పూర్తి చేశారు. పంచనారసింహస్వామి వారికి 5కోట్ల నామాలను పూర్తి చేశారు.