యాదాద్రి, ఆగస్టు 5 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దివ్యక్షేత్రంతో పాటు అనుబంధ పూర్వగిరి(పాతగుట్ట) ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా స్వాతి నక్షత్ర పూజలు ఘనంగా నిర్వహించారు. స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని సంప్రదాయరీతిలో విశేష పూజలు చేశారు. వేకువజామునే స్వయంభువులను కొలిచిన అర్చకులు ప్రధానాలయ ముఖ మండపంలో కవచమూర్తులకు అష్టోత్తర శతఘటాభిషేకం పూజలు చేశారు.
ముందుగా 108 వెండి కళశాలకు పూజలు చేశారు. పంచసూక్త పఠనంతో హోమం చేసి ఉత్సవమూర్తులు, ప్రతిష్ఠా అలంకార మూర్తులను అభిషేకించారు. తులసీ దళాలతో సహస్రనామార్చనలు చేశారు. తెల్లవారుజామున 4గంటల నుంచి ఐదున్నర గంటల వరకు గిరిప్రదక్షిణలో భక్తులు పాల్గొని మొక్కలు తీర్చుకున్నారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో శుక్రవారం శ్రావణమాస వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయం వెలుపలి ప్రాకారంలోని ఈశాన్య మండపంలో ‘శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన’ ఘనంగా నిర్వహించారు.
ప్రధానార్చక బృందం అమ్మవారికి కుంకుమార్చన చేశారు. శ్రావణ శుక్రవారం కావడంతో పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరాలయంలో వరలక్ష్మి వత్రాన్ని శాస్ర్తోక్తంగా జరిపించారు. లక్ష్మి అమ్మవారిని దివ్య మనోహరంగా అలంకరించి వేడుకలు జరిపించారు. వేడుకల్లో ఆలయ ఈఓ ఎన్.గీత, ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనర్సింహాచార్యులు, పురోహితులు పాల్గొన్నారు.
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రంలో నిత్యపూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం మూడున్నర గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనర్సింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. తిరువారాధన, బాలబోగం, స్వామివారికి నిజాభిషేకం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు తులసీ సహస్రనామార్చనలు, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చనలు చేశారు. ప్రధానాలయ లోపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు.
సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణతంతు జరిపించారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, స్వామి, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన, వెండి మొక్కు జోడు సేవలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. క్యూ కాంప్లెక్స్ చెంత కొలువైన క్షేత్ర పాలక ఆంజనేయస్వామికి నిర్వహించిన పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ప్రధానాలయ ప్రాకార మండపంలోని అద్దాల మండపంలో ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు.
ప్రధానాలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలోఆండాళ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వయంభూ నారసింహుడి ప్రధానాలయంలోని వెలుపల ప్రాకారం అద్దాల మండపంలో ఊయలలో శయనింపు చేసి గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటలు పాడారు. కొండకింద దీక్షాపరుల మండపంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. పాతగుట్టలో స్వామివారి నిత్యారాధనలు ఘనం గా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. శ్రీవారి ఖజానాకు రూ.12,62,970 ఆదాయం వచ్చినట్లు ఆలయాధికారులు తెలిపారు.
యాదాద్రి కొండపైకి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డును ఆలయాధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఇటీవల కురిసిన వర్షానికి మొదటి ఘాట్రోడ్డు రక్షణ గోడను కూలిపోవడంతో పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఘాట్రోడ్డును తాత్కాలికంగా మూసివేసి రెండో ఘాట్ రోడ్డును పునః ప్రారంభించారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో శుక్రవారం నిర్వహించిన స్వాతి నక్షత్ర పూజల్లో ఏపీ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన అభివృద్ధి శాఖ మంత్రి ఆర్కే.రోజా పాల్గొన్నారు. శ్రావణమాసం సందర్భంగా ప్రధానాలయ ప్రాకార మండపంలో జరుగుతున్న ‘శ్రావణలక్ష్మీ కోటి కుంకుమార్చన’, శివాలయంలో చేపట్టిన వరలక్ష్మి వ్రతంలో పాల్గొని పూజలు చేశారు.
అనంతరం స్వయంభూ నారసింహుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆమెకు ఆలయ సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు. అద్దాల మండపంలో మంత్రికి అర్చకులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఏఈఓ దోర్భల భాస్కర్శర్మ ఆమెకు స్వామివారి ప్రసాదం అందించారు. అనంతరం రోజా మాట్లాడుతూ శ్రావణమాసంతో పాటు స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతినక్షత్రంలో స్వామి, అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
సీఎం కేసీఆర్ కారణజన్ముడని కొనియాడారు. యాదాద్రి ఆలయాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. గతంతో పోలిస్తే యాదాద్రి దేవస్థానం ఎంతో వృద్ధి చెందిందన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే స్వామివారు సీఎం కేసీఆర్కు ఎంతో శక్తిని, ఉత్సాహాన్ని ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ పురాణపండ శ్రీనివాస్ రూపొందించిన ‘శ్రీమాలిక’ అద్భుత గ్రంథాన్ని ఆమె పలువురు భక్తులకు అందజేశారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 1,14,300
వీఐపీ దర్శనం 30,000
వేద ఆశీర్వచనం 7,200
నిత్యకైంకర్యాలు 4,400
సుప్రభాతం 1,100
క్యారీబ్యాగుల విక్రయం 3,200
వ్రత పూజలు 81,600
కళ్యాణకట్ట టిక్కెట్లు 13,600
ప్రసాద విక్రయం 5,20,070
వాహనపూజలు 13,300
శాశ్వత పూజలు 15,000
అన్నదాన విరాళం 15,732
సువర్ణ పుష్పార్చన 61,832
లక్ష్మీ పుష్కరిణి 500
యాదరుషి నిలయం 24,976
పాతగుట్ట నుంచి 28,860
కొండపైకి వాహనాల అనుమతి 1,25,000
శివాలయం 2,300