యాదాద్రి, ఆగస్టు 1 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం భక్తజన సందడి నెలకొంది. శ్రావణమాసం కావడంతో స్వామివారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తుల తరలివచ్చారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు జరిగే సువర్ణ పుష్పార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు. భక్తుల గోత్రనామాల పేరిట సంకల్పం చేశారు. శ్రావణమాసంలో భాగంగా శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన వైభవంగా సాగుతున్నది. నాలుగో రోజులో భాగంగా అర్చకులు కుంకుమతో అర్చించారు. లక్ష్మీసహస్రనామార్చన కొనసాగుతున్నది.
ఆండాళ్ అమ్మవారి తిరునక్షత్రోత్సవాలు ప్రధానాలయంతో పాటు పాతగుట్టలో వైభవంగా సాగాయి. లక్ష్మీనారసింహుడికి అర్చకులు నిత్యోత్సవాలు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహ హోమం ఘనంగా నిర్వమించారు. సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. అనంతరం మొదటి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు.
పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. కొండకింద దీక్షాపరుల మండపం వద్ద గల వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటకంగా సాగాయి. కొండపై వేంచేసి ఉన్న పర్వత వర్దినీ సమేత రామలింగేశ్వరస్వామికి అర్చకులు, పురోహితులు అభిషేక పర్వాలు ఘనంగా నిర్వహించారు.
సోమవారం కావడంతో గర్భాలయంలోని లింగేశ్వర కుటుంబంతో పాటు ఆలయంలో నూతనంగా ప్రతిష్టించిన స్పటిక లింగేశ్వరుడికి ప్రభాతవేళ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని సుమారు గంటన్నర పాటు నిర్వహించారు. శివాలయం ప్రధాన పురోహితుల ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ చేశారు. సాయంత్రం రామలింగేశ్వరుడి సేవను శివాలయ మాఢవీధుల్లో ఊరేగించారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామి ఖజానాకు రూ. 32,34,744 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 1,29,250
వీఐపీ దర్శనాలు 1,50,000
వేద ఆశీర్వచనం 6,600
క్యారీబ్యాగుల విక్రయం 19,250
వ్రత పూజలు 91,200
కళ్యాణకట్ట టిక్కెట్లు 30,000
ప్రసాద విక్రయం 9,45,750
వాహనపూజలు 15,700
అన్నదాన విరాళం 43,090
సువర్ణ పుష్పార్చన 1,65,748
యాదరుషి నిలయం 63,776
పాతగుట్ట నుంచి 25,830
కొండపైకి వాహన ప్రవేశం 2,50,000
లక్ష్మీ పుష్కరిణి 800
శివాలయం 3,700