మునుగోడు, ఏప్రిల్ 26 : నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగానికి విరుద్ధంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా మార్చేందుకు పెద్ద కుట్ర చేస్తున్నదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో నిర్వహించిన సీఐటీయూ మండల జనరల్ బాడీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై మే 20న 11 కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక వర్గం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
కార్మికుల హక్కుల కోసం రక్తం చిందించి, హక్కులను పోరాడి సాధించుకున్న మే1న ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని మండలంలోని అన్నిగ్రామాల్లో ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రైవేటీకరణతో సామాజిక న్యాయం దెబ్బతింటుందని, రిజర్వేషన్లు రద్దు అవుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ధరలు ఆకాశాన్ని అంటుతుంటే మళ్లీ పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ విధానాలపై కార్మిక వర్గం ప్రతిఘటనే మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మె అన్నారు.
సీఐటీయూ మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు బండ శ్రీశైలం, రైతు సంఘం జిల్లా నాయకుడు సాగర్ల మల్లేశ్, డీవైఎఫ్ఐ జిల్లా సహా కార్యదర్శి మిర్యాల భరత్, రైతు సంఘం మండల కార్యదర్శి వేముల లింగస్వామి, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు జీడిమడ్ల సైదులు, ఎర్ర అరుణ, ఎన్ లక్ష్మి, నీరుడు రాజ్యలక్ష్మి, ఎన్.పెద్దమ్మ, సంపూర్ణ, లలిత, సరిత, టి.ధనలక్ష్మి, ఎస్.వసుమతి, ఎన్.లింగమ్మ, పి.పద్మ, సీహెచ్.గంగ పాల్గొన్నారు.