ఉద్యమాల పురిటి గడ్డ.. రాజకీయ చైతన్యానికి వేదిక అయిన సూర్యాపేట ప్రాంతం అభివృద్ధిలో మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో అట్టడుగున ఉండేది. సాగునీటి వసతి లేక బీడుపడ్డ భూములు, చేసేందుకు పని లేక ఊళ్లకు ఊళ్లు వలస బాట పట్టడంతో తాళాలు పడ్డ ఇండ్లు అనేకం కనిపించేవి. తాగునీటికి సైతం హైదరాబాద్ మురికి నీటి మీద ఆధారపడిన దుస్థితి. రాజకీయ బెదిరింపులతో వ్యాపార వర్గాలు సైతం విసుగెత్తిపోయేవి. అలాంటిది స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో, మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సంక్పలంతో సూర్యాపేట నియోజకవర్గం దశ తిరిగింది. కొత్త జిల్లా ఏర్పాటుతో ఇక్కడ అభివృద్ధికి వేగంగా అడుగులు పడ్డాయి. పాలన చేరువైంది. లా అండ్ ఆర్డర్ పటిష్టంగా అమలు అవుతుండడంతో ప్రశాంత వాతావరణం నెలకొంది. మెడికల్ కాలేజీ జిల్లా కేంద్ర దవాఖాన ఆధునీకరణతో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని గోదావరి జలాలు నెర్రెలు పట్టిన నేలలను సస్యశ్యామలం చేశాయి. మూసీ ఆధునీకరణ, కృష్ణా జలాల్లో నిక్కచ్చి వాటా రైతాంగానికి మరింత కలిసి వచ్చింది. కంప చెట్లు కమ్మేసిన చెరువు కట్టలు మినీ ట్యాంక్ బ్యాండ్లుగా మారి ఆహ్లాదం పంచుతున్నాయి. మిషన్ భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నది. దేశానికే మోడల్గా సూర్యాపేటలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సిద్ధమవుతున్నది. గురుకుల పాఠశాలలు, కాలేజీల ఏర్పాటు, మన ఊరు-మన బడితో ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతమవుతున్నది. స్వయంగా విద్యుత్ శాఖ మంత్రి అయిన జగదీశ్రెడ్డి రూ.500 కోట్లతో విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడంతో నాణ్యమైన 24 గంటల కరంట్ అందుతున్నది. ఈ తొమ్మిదేండ్ల కాలంలో సూర్యాపేట నియోజకవర్గానికి అభివృద్ధి, సంక్షేమం విషయంలో రూ.7వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూరినట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
– సూర్యాపేట, మార్చి 18
అభివృద్ధి విషయంలో సూర్యాపేటను 2014కు మందు, తరువాతగా చూడాల్సిందే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు సమస్యల నిలయంగా, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న నియోజకవర్గాన్ని స్వరాష్ట్రంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశారు. 9 సంవత్సరాల్లో నియోజకవర్గంలో రూ.7వేల కోట్లకు పైగా నిధులను అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించడం గమనార్హం. గతంలో చెట్టూ చేమలతో ఉన్న చెరువు కట్టలు ఇప్పుడు ఆహ్లాదం పంచే పార్కులుగా మారాయి. జిల్లా కేంద్రం ఏర్పాటు, ఆ వెంటనే మెడికల్ కళాశాల మంజూరు, నిర్మాణం జరిగింది. దేశంలోనే మోడల్గా నిలిచే వెజ్, నాన్ వెజ్ మార్కెట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నర్సింగ్ కళాశాల, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి. విద్య మౌలిక వసతులు సమకూరి అభివృద్ధికి కేరాఫ్గా సూర్యాపేట నియోజకవర్గం నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం సూర్యాపేట నుంచి రెండు సార్లు విజయం సాధించి మంత్రిగా పనిచేస్తున్న గుంటకండ్ల జగదీశ్రెడ్డి సారథ్యంలోనే ఈ విజయం సాధ్యమైంది.
– సూర్యాపేట, మార్చి 18
సంక్షేమంలో నంబర్ వన్
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అందించడంలో సూర్యాపేట నియోజకవర్గం నంబర్ వన్గా నిలుస్తున్నది. కల్యాణలక్ష్మి పథకం కింద 8,857 మందికి రూ.80.77 కోట్లు, షాదీ ముబారక్ ద్వారా 572 మందికి రూ.5.06 కోట్లు అందించారు. 25,620 మందికి ఆసరా పింఛన్లు ప్రతి నెలా రూ.6.01 కోట్లు అందిస్తున్నారు.
రూ.300 కోట్లతో ఇంటింటికీ తాగునీరు
హైదరాబాద్ నుంచి వచ్చే మూసీ మురుగు నీటిని మంచినీరుగా తాగిన సూర్యాపేట జిల్లా కేంద్ర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన కృష్ణా నీటిని అందించింది. జిల్లా కేంద్రంతో పాటు 113 గ్రామ పంచాయతీలకు, వాటి పరిధిలోని ఆవాసాలకు రూ.300 కోట్లు ఖర్చు చేసి శుద్ధి జలాలను సరఫరా చేస్తున్నది.
సాగు సస్యశ్యామలం
సూర్యాపేట నియోజకవర్గానికి కృష్ణా, గోదావరి, మూసీ నదుల నుంచి సాగు నీరు అందే అవకాశమున్నా.. తెలుగుదేశం, కాంగ్రెస్ పాలనలో కమీషన్లు, రాజకీయాల కోసం నీళ్లు రాకుండా చేశారు. స్వరాష్ట్రంలో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి మూడు నదుల నీటిని తీసుకొచ్చి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి జగదీశ్రెడ్డి ప్రణాళికలతో కాళేశ్వరం జలాలను సూర్యాపేట జిల్లాకు తీసుకొచ్చారు. ఆ నీటితో ఆత్మకూర్(ఎస్), చివ్వెంల, పెన్పహాడ్ మండలాల రైతులు రెండు పంటలు పండిస్తున్నారు. సూర్యాపేట మండలంలో ఉన్న మూసీ ప్రాజెక్టు గేట్లకు తూట్లు పడి నీరు వృథాగా పోతున్నా గత పాలకులు పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.20 కోట్లతో గేట్ల మరమ్మతులు, రూ.66 కోట్లతో కాల్వల ఆధునీకరణ పనులు చేయించింది. దీంతో మూసీ నది ఒక్కసారి నిండితే రెండు పంటలకు సాగు నీరు సరిపోతుంది. మూసీ, పాలేరు వాగులపై రూ.160 కోట్లు ఖర్చు చేసి 24 చెక్డ్యామ్లు నిర్మించారు. వీటితో పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. ఎస్సారెస్పీ కాల్వల మరమ్మతుల కోసం దాదాపు రూ.10కోట్లు ఖర్చు చేశారు. రూ.3 కోట్లతో 21 లిఫ్ట్ల మరమ్మతులు చేపట్టారు. మిషన్ కాకతీయ కింద రూ.72 కోట్లతో 231 చెరువులను పునరుద్ధరించారు. ఫలితంగా నియోజకవర్గంలోని మొత్తం భూమి సాగులోకి వచ్చింది.
స్వయం ఉపాధికి చేయూత
దళిత బంధు పథకం కింద నియోజకవర్గంలో వంద మందికి రూ.10 కోట్లు ఇచ్చి వారు స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించారు. ఎస్సీ స్వయం ఉపాధి పథకం కింద 1,692 మందికి రూ.40.5 కోట్లు, ఎస్టీ స్వయం ఉపాధి కింద 650 మందికి రూ.11 కోట్లు, బీసీ స్వయం ఉపాధి పథకం కింద 370 మందికి రూ.2.50 కోట్లు, 63 మంది మైనార్టీలకు రూ.8కోట్లు అందించారు. సమభావన సంఘాలకు రూ.450 కోట్లు, వడ్డీలేని రుణాలు రూ.62 కోట్లు, మినీ డెయిరీలకు రూ.25.02 కోట్లు అందించి వారి ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటునందించారు.
సర్వమతాలకు సమానంగా..
నియోజకవర్గంలో సర్వ మతాలకు సమ ప్రాధాన్యమిస్తూ పండుగలను అధికారికంగా నిర్వహిస్తూ పేదలకు సాయం చేస్తున్నారు. పెద్దగట్టు లింగమతుల స్వామి జాతరకు సుమారు రూ.20 కోట్లు ఖర్చు చేసి పలు అభివృద్ధి పనులు చేపట్టారు. క్రిస్టియన్ భవనం నిర్మాణం కోసం రూ.2 కోట్లు, చర్చిల మరమ్మతులకు రూ.15లక్షలు, మసీదుల అభివృద్ధికి రూ.5 కోట్లు, దేవాలయాల అభివృద్ధికి రూ.5 కోట్లు అందించారు. బతుకమ్మ చీరెలు, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా ఇస్తూ అన్ని మతాలను సమానంగా చూస్తున్నారు.
జిల్లా ఏర్పాటుతో మారిన రూపురేఖలు
జిల్లా కేంద్రంగా మారిన సూర్యాపేట పట్టణం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. మంత్రి జగదీశ్రెడ్డి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పట్టణ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. రాష్ట్రంలో ఏ పట్టణంలోనూ లేనివిధంగా రెండు మినీ ట్యాంక్బండ్లు ఏర్పాటు చేశారు. సద్దుల చెరువు మినీ ట్యాంక్బండ్గా రూపుదిద్దుకొని ప్రజలకు అందుబాటులోకి రాగా.. ఇప్పుడు పుల్లారెడ్డి చెరువును మినీ ట్యాంక్బండ్గా మారుస్తున్నారు. ఈ రెండింటికీ రూ.42కోట్ల వరకు ఖర్చు చేశారు. మురుగు నీటి శుద్ధి కోసం రూ.120 కోట్లు, పట్టణ అంతర్గత రోడ్లకు రూ.150 కోట్లు, డ్రైనేజీకి రూ.85 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోనే మోడల్గా నిలిచిన మోడల్ మార్కెట్కు రూ.31 కోట్లు, శ్మశాన వాటికల అభివృద్ధికి రూ.15 కోట్లు, పట్టణ ప్రకృతి వనాలకు రూ.5 కోట్లు, ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు రూ.80 కోట్లు పలు అభివృద్ధి పనులకు కేటాయించారు. అమృత్ పథకం కింద మంజూరైన రూ.40 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.95 కోట్లతో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టగా.. పనులు తుది దశకు చేరుకున్నాయి.
సూర్యాపేటకు తలమానికం మెడికల్ కళాశాల
మంత్రి జగదీశ్రెడ్డి ప్రత్యేక కృషితో సూర్యాపేటకు మెడికల్ కళాశాల రావడంతో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతున్నది. వైద్య కళాశాలకు రూ.156 కోట్లు, వైద్య మౌళిక సదుపాయాలకు రూ.600 కోట్లు, నర్సింగ్ కళాశాలకు రూ.40 కోట్లు, పబ్లిక్ హెల్త్ ద్వారా రూ.50 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 22 వేల మందికి సుమారు రూ.60 కోట్లు ఖర్చు చేశారు. 34,074 మందికి రూ.11కోట్ల విలువైన కేసీఆర్ కిట్లు అందించారు. నియోజకవర్గంలో తొమ్మిదేండ్లలో 5,015 మందికి రూ.22.46 కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం అందించారు. 503 మందికి రూ.10.10కోట్ల ఎల్ఓసీలు అందజేశారు.
1,850 ఇండ్ల నిర్మాణం
పేదలకందించే రెండు పడకల ఇండ్లు నియోజకవర్గంలో 1850 పూర్తయ్యాయి. ఇందు కోసం సుమారు రూ.120 కోట్లకు పైగా ఖర్చు చేశారు. వీటిని ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా జిల్లా కేంద్రంలోని గొల్ల బజార్లో లబ్ధిదారులకు అందించడం జరిగింది. త్వరలో మరో 1200 మందికి అందించనున్నారు. ఇందుకోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నది.
109 పాఠశాలల ఆధునీకరణ
మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా రూ.25 కోట్లతో 109 ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించారు. రూ.35 కోట్లతో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, రూ.49కోట్లతో గురుకుల డిగ్రీ కళాశాల, రూ.11కోట్లతో ఎస్టీ గురుకుల పాఠశాల, రూ.8.20 కోట్లతో ఎస్టీ డిగ్రీ కళాశాల నిర్మాణం చేపట్టారు. రూ.10.20 కోట్లతో 3బీసీ గురుకులాలు, రూ.3 కోట్లతో మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాల నిర్మాణం చేపట్టారు.
అన్నదాతకు అండగా..
అన్నదాతకు అండగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా రైతు బంధు పథకం కింద నియోజకవర్గ రైతులకు ఇప్పటి వరకు రూ.650 కోట్ల పెట్టుబడి సాయం అందింది. 746 మంది రైతులు మృతిచెందగా.. వారి కుటుంబాలకు రైతు బీమా పథకం కింద రూ.37.30 కోట్ల ఇన్సూరెన్స్ అందించి ఆదుకున్నారు. 35వేల మంది రైతులకు రూ.150కోట్ల రైతు రుణమాఫీ అయ్యింది. వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మ యాంత్రీకరణ కోసం రూ.14 కోట్లు అందించారు. రూ.4కోట్ల వ్యయంతో 17 రైతు వేదికలను, రూ.30 కోట్లతో నాలుగు గిడ్డంగులను నిర్మించారు.
రూ.500 కోట్లతో విద్యుత్ ఆధునీకరణ
నియోజకవర్గ వ్యాప్తంగా విద్యుత్ ఆధునీకరణ చేపట్టారు. ఇందుకోసం సుమారు రూ.500 కోట్లు కేటాయించారు. సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు నిర్మించారు. అవసరమైన స్తంభాలు ఏర్పాటు చేసి గృహాలతో పాటు వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నారు. దీంతో పాటు డీఎంఎఫ్టీ నిధులు రూ.70 కోట్లు, సీడీపీ రూ.16 కోట్లు, సీఎస్ఆర్ రూ.8 కోట్లు, టీఎస్ ప్రైడ్ నిధులు రూ.39 కోట్లతో నియోజకవర్గంలో అనేక పనులు చేశారు.
వృత్తి దారులకు ప్రోత్సాహం
నియోజకవర్గంలో చేతి వృత్తులు, కుల వృత్తిదారులకు ప్రోత్సాహం పెద్ద ఎత్తున అందించారు. మత్స్యకారులకు చేప పిల్లలు, వాహనాల కోసం రూ.5.20 కోట్లు అందించారు. రూ.44కోట్ల విలువైన సబ్సిడీ గొర్రెలు, రూ.3కోట్లతో సబ్సిడీ బర్రెలు అందజేశారు. 68 అంబేద్కర్ భవనాల నిర్మాణం కోసం రూ.15.06 కోట్లు మంజూరు చేశారు. 22 కుల వృత్తి సంఘాల ఆత్మ గౌరవ భవనాల కోసం రూ.17.03 కోట్లు కేటాయించారు.
బాగుపడ్డ లా అండ్ ఆర్డర్..
సూర్యాపేటలో గతంలో రౌడీయిజం ఎక్కువ. వ్యాపారులను వేధించి మామూళ్లు వసూలు చేయడం పరిపాటిగా ఉండేది. స్వరాష్ట్రంలో మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో సూర్యాపేటలో లా అండ్ ఆర్డర్ను కఠినంగా అమలు చేస్తుండడంతో పరిస్థితి గాడిన పడింది. నేడు ఎక్కడా ఎలాంటి బెదిరింపులకు తావు లేదు. నాడు నీళ్ల వ్యాపారం నుంచి బార్ షాపుల వరకు మామూళ్లు వసూలు చేయగా.. నేడు ఆ ఊసే లేదు. ఇప్పుడు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. నాడు మామూళ్ల భయంతో రియల్ వ్యాపారం కుప్పకూలగా, నేడు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతున్నది. మొత్తం మీద గతంలో భయంభయంగా గడిపిన వ్యాపారులు.. ఇప్పుడు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకుంటున్నారు.
సూర్యాపేట నలువైపులా అభివృద్ధి
2014లో జరిగిన తొలి ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే కాదు.. జనానికి అవసరమున్న అనేక పనులను హామీ ఇవ్వకున్నా అమలు చేశాం. నాటి ఎన్నికల ప్రచారానికి వచ్చిన సీఎం కేసీఆర్ కుర్చీ వేసుకొని తాగునీటిని ఇస్తామన్నారు. ఆ మేరకు నేడు స్వచ్ఛమైన తాగునీరు సూర్యాపేటకు అందుతున్నది. సాగు, తాగు నీటితో పాటు విద్యుత్, రహదారులు ఇలా అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయి. జిల్లా కేంద్రంగా మారిన సూర్యాపేటలో అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించకుండా నలువైపులాs చేపడుతున్నాం. ఓ వైపు ఎస్పీ కార్యాలయం, మరో వైపు జిల్లా పోలీస్ ఆఫీస్, పట్టణం నడిబొడ్డున మెడికల్ కాలేజీ ఇలా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి జరుగుతున్నాయి. సద్దుల చెరువు మినీ ట్యాంక్బండ్గా వెలుగొందుతుండగా, పట్టణంలోని పాత టౌన్కు వెలుగులు తీసుకొచ్చేందుకు మరో పక్కన ఉన్న పుల్లారెడ్డి చెరువును ట్యాంక్బండ్గా తీర్చిదిద్దుతున్నాం. నియోజకవర్గం మొత్తం రహదారుల నిర్మాణం జరిగింది. కాళేశ్వరం, మూసీ, నాగార్జునసాగర్ నీళ్లతో జిల్లా మొత్తం సస్యశ్యామలమై రైతుల పంట పండుతున్నది. దాంతో భూముల ధరలు కూడా భారీగా పెరిగాయి.
– గుంటకండ్ల జగదీశ్రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి
గ్రామాలకు మహర్దశ
కండ్ల ముందు నీళ్లు.. తనివి తీరా పంట
ఏటిలో చెక్డ్యామ్లు నిర్మించడంతో కండ్ల ముందు నీళ్లు ఉన్నాయి. వాటితో తనివితీరా వరి పొలం సాగు చేసుకుంటున్నాం. గత ప్రభుత్వాల హయాంలో వర్షం వచ్చినప్పుడు ఏటిలో నీరంతా వృథాగా పోయి పాలేరులో కలిసేది. మా పొలం వాగు పక్కన ఉన్నా వ్యవసాయానికి నీరు లేక అల్లాడిపోయేవాళ్లం. సాగునీటి కోసం ఏటిలో చెక్డ్యామ్లు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వాలకు రైతులు, గ్రామస్తులు ఎన్నోసార్లు విన్నవించినా ఫలితం లేకుడాపోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే అయిన మంత్రి జగదీశ్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి ఏపూరు వాగులో ఏడు చెక్డ్యామ్ల నిర్మాణానికి అనుమతులు తీసుకొచ్చారు. చెక్డ్యామ్ల ఏర్పాటుతో భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉండడంతో ఇప్పుడు రెండు కార్లు పంటలు పండిస్తున్నాం.
– సానబోయిన సుధాకర్, ఏపూరు, ఆత్మకూర్ (ఎస్) మండలం
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మూసీ కాల్వలు అభివృద్ధి
మూసీ ప్రాజెక్టును, మూసీ కాల్వలను అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో మూసీ ప్రాజెక్టు గేట్ల లీకేజీలతో చుక్క నీరు ఉండేది కాదు. మూసీలో చేరిన నీరంతా వాగులోంచి సముద్రంలోకి పోయేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మూసీ గేట్ల మరమ్మతులు చేయడంతో చుక్కనీరు కూడా వృథాగా పోవడం లేదు. ఎప్పుడూ నిండుకుండలా కనిపిస్తున్నది. ఇంతకుమునుపు మూసీ కాల్వల్లో కంపచెట్లు ఉండటంతో చివరి వరకు నీళ్లు పోకపొయ్యేది. మరమ్మతులు చేయడంతో ఇప్పుడు కాల్వ చివరి భూములకు సాగు నీరందుతున్నది. మూసీ ప్రాజెక్టు, కాల్వలను ఆధునీకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి జగదీశ్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు.
– గోళ్ల సైదులు, రాయిన్గూడెం, (సూర్యాపేట రూరల్)
మార్కెట్ ప్రారంభమైతే మా కష్టాలు తీరుతాయి
ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ ఇరుకుగా ఉన్న కూరగాయల మార్కెట్ రోడ్డులో 20సంవత్సరాలుగా కూరగాయల వ్యాపారం చేస్తున్నా. ఎంతో మంది నాయకులు వచ్చారు.. పోయారు. మా కోసం ఎవరూ ఏమీ చేయలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని ముందే చేస్తున్నారు. మా ఎమ్మెల్యే అయిన మంత్రి జగదీశ్రెడ్డి మా కోసం కోట్ల రూపాయలతో సూర్యాపేట పట్టణం నడిబొడ్డున ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించడం సంతోషంగా ఉన్నది. ఆ మార్కెట్ పూర్తయితే రోడ్డుపై ఇలా వ్యాపారం చేసే బాధ ఉండదు. మార్కెట్ నిర్మించి మాకు భరోసా కల్పిస్తున్న మంత్రి జగదీశ్రెడ్డికి, ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– గోపగాని నీలమ్మ, కూరగాయల వ్యాపారి, సూర్యాపేట
సొంతింట్లో సంతోషంగా ఉన్నాం
మాకు గతంలో ఇల్లు లేక మా ఊర్లోనే తెలిసిన వాళ్ల పాత ఇంట్లో ఉండేవాళ్లం. ఆ ఇల్లు వానొస్తే కురిసేది. మాకు ఒక కొడుకు, ఇద్దరు బిడ్డలు. వాళ్లు పండుగలకు వస్తే చాలా ఇబ్బంది అయ్యేది. ప్రభుత్వం నుంచి ఇండ్లు ఇస్తున్నరని మా సర్పంచ్ దగ్గరుండి దరఖాస్తు చేయించి రెండు పడకల ఇల్లు ఇప్పించాడు. ఇప్పుడు సంతోషంగా ఉంటున్నాం. మాకు ఇల్లు కట్టిచ్చిన ముఖ్యమంత్రి, మంత్రి జగదీశ్రెడ్డి సార్లకు జీవితాంతం రుణపడి ఉంటాం. ఇటువంటి ప్రభుత్వం ఉన్నంత కాలం మాలాంటి పేదోళ్లకు మంచి జరుగుద్ది.
– నకిరేకంటి వెంకటమ్మ, జి.తిరుమలగిరి, చివ్వెంల మండలం