హాలియా, అక్టోబర్ 29 : నాగార్జునసాగర్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ను మరోసారి అఖండ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపు నిచ్చారు. ఆదివారం హాలియాలోలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన ఆత్మగౌరవ సభలో ఆమె ఎమ్మెల్యే నోముల భగత్కుమార్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్, రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ వాల్యనాయక్తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారన్నారు. తండాలను గ్రామపంచాయతీలుగా చేయడంతో పాటు, వాటిని అభివృద్ధి చేశారని, ఆరు శాతం ఉన్న గిరిజన రిజర్వేషన్లును 10 శాతానికి పెంచారని పేర్కొన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలవుతున్నాయన్నారు. దేశంలో వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ అందిస్తే తానే గులాబీ కండువా వేసుకొని రాష్ట్ర మంతా ప్రచారం చేస్తానని ఆనాడు సీఎల్పీ నేతగా శాసన సభలో ప్రకటించిన జానారెడ్డి నేడు ఎందుకు మాట తప్పారని ప్రశ్నించారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీకి అతీగతీ లేదని, ఆ పార్టీ నాయకులు ఇచ్చే మాటలకు గ్యారంటీ ఉండదన్నారు. 100 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ రేవంత్రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించుకోవడం ఆ పార్టీ దౌర్భాగ్యం అన్నారు. కర్నాటకలో రూ.600 పింఛన్ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో మాత్రం తాము అధికారంలోనికి వస్తే రూ.3 వేలు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులని, 2018, 2021 ఎన్నికల్లో జానారెడ్డిని ఓడించినట్లే ఈ ఎన్నికల్లో జానారెడ్డి కుమారుడిని ఓడించాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో పంచాయతీరాజ్శాఖ మంత్రిగా ఉన్న జానారెడ్డి నియోజకవర్గ ప్రజలకు కనీసం తాగునీటిని కూడా ఇవ్వలేక పోయారని విమర్శించారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోనికి వస్తే సౌభాగ్యలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ. 3వేలు, రూ.400కే వంటగ్యాస్ సిలిండర్, రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం, రేషన్కార్డు ఉన్న ప్రతి ఇంటికీ రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. రైతుబంధు పథకాన్ని ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెంచనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 25 ఏండ్లలో కాంగ్రెస్ పార్టీ కేవలం 3 లక్షల ఎకరాలకు పోడుభూమి పట్టాలు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ఐదేండ్ల కాలంలోనే 4.06 లక్షల ఎకరాలకు పోడు పట్టాలను అందించినట్లు తెలిపారు. ఇంకా పట్టాలు రాని వారు ఉంటే ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే వారం రోజుల్లోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గిరిజనులంతా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి నోముల భగత్ కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గం, ఈ ప్రాంతంలోని గిరిజనుల వెనుకబాటుకు జానారెడ్డే కారణమని ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. 7 సార్లు ఎమ్మెల్యేగా జానారెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేశారన్నారు. పేద ప్రజలు ఉన్నత చదువులు చదువుకుంటే తమను ప్రశ్నిస్తారని భావించిన జానారెడ్డి ఈ ప్రాంతంలో కనీసం ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల గానీ, గిరిజన భవన్ గానీ ఏర్పాటు చేయలేదన్నారు.
35 ఏండ్లు ప్రతిపాదనలకే పరిమితమైన నెల్లికల్లు లిఫ్టును శంకుస్థాపన చేయడంతో పాటు దాని నిర్మాణానికి రూ. 687 కోట్లు మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. డీ 8,9 కాల్వలపై ఏర్పాటు చేసిన లిఫ్టును ప్రారంభించ కుండా జానారెడ్డి అడ్డుకున్నాడని విమర్శించారు. 35 ఏండ్ల క్రితం డొక్కు స్కూటర్ కూడా లేని జానారెడ్డి నేడు వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడో ప్రజలకు చెప్పాలన్నారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ఆయన కొడుకునే పంపుతున్నాడని, గిరిజనులంతా ఆయనకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని కోరాఆరు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు కారుగుర్తుకు ఓటు వేసి తనను మరోసారి గెలిపిస్తే.. ఎల్లవేళలా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధిని కొనసాగిస్తానన్నారు.
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్ని స్థానాల్లో విజయం సాధించి మూడో సారి సీఎంగా కేసీఆర్ అధికారం చేపట్టడం ఖాయమని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తండాల రూపురేఖలే మారిపోయాయన్నారు. నెల్లికల్లు లిఫ్టును పూర్తి చేయడం బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందన్నారు. అందుకోసమే నియోజకవర్గ ప్రజలంతా ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు.
సీఎం కేసీఆర్ పాలనలోనే గిరిజనులను జీవితాల్లో వెలుగులు నిండాయని, గిరిజన తండాలు బాగుపడ్డాయని ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్ అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడం వల్లే మన గ్రామాన్ని మనమే పరిపాలించుకునే అవకాశం లభించిందన్నారు. మరో మారు బీఆర్ఎస్ను గెలిపించి తండాలను మరింతగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి 55 ఏండ్లు ఓటేసి గెలిపించామని, అయినా ఆ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చేసిందేమీ లేదని రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ వాల్యానాయక్ అన్నారు. సీఎం కేసీఆర్ అధికారంలోనికి వచ్చాకే గిరిజన తండాలను పంచాయతీలుగా చేయడంతో రాష్ట్రంలో 3,116 మంది గిరిజనులు సర్పంచులుగా అయ్యారన్నారు. గిరిజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆలోచించి ఓటేయాలని, బీఆర్ఎస్ను మరో మారు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జవ్వాజి వెంటేశ్వర్లు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాదం సంపత్కుమార్, కడారి అంజయ్య, బాబూరావునాయక్, విష్ణువర్ధన్రావు, కర్ణ బ్రహ్మారెడ్డి, వివేక్రావు, నియోజకవర్గ అధ్యక్షుడు భిక్షానాయక్, రవినాయక్, జయరాం, సీతారాంనాయక్, గుంటుక వెంకట్రెడ్డి, హాలియా మున్సిపల్ వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీపీలు కూరాకుల అంతయ్య, అనుముల ఏడుకొండల్, ఎడవల్లి మహేందర్రెడ్డి, అల్లి పెద్దిరాజు, వివిధ గ్రామల సర్పంచులు పాల్గొన్నారు.