కేతేపల్లి, మార్చి 18 : గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొడంతో కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో యువతి మరణించగా మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మండల పరిధిలోని చీకటిగూడెం గ్రామ శివారులో 65వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం ఈ ఘటన జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన కరుణం ప్రీతి(21) అమెరికాలో విద్యనభ్యసిస్తోంది. బంధువులతో కలిసి ఇటీవల హైదరాబాద్కు వచ్చింది. విజయవాడలో తమ బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు ప్రీతి హైదరాబాద్ నుంచి బంధువులతో కలిసి ఈ 16న కారులో విజయవాడకు వెళ్లింది.
ఆదివారం అమెరికాకు వెళ్లాల్సి ఉండడంతో శనివారం కారులో హైదరాబాద్కు తిరుగు ప్రయాణమైంది. ఈ క్రమంలో చీకటిగూడెం వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం వీరు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారు అదుపుతప్పి రోడ్డుపై ఫల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రీతి తల, నడుము భాగాల్లో బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. వాహనంలో ఉన్న ప్రీతి చిన్నమ్మ చేకూరి సరితకు తీవ్ర గాయాలు కాగా మిగతా వారు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం నెల్లూరుకు తరలించారు.