నల్లగొండ : కేంద్రంలోని ప్రభుత్వం అవలంభిస్తున్న తీరు దుర్మార్గం, హేయం. బిజెపి రైతు వ్యతిరేక ప్రభుత్వమని మరోసారి రుజువయ్యింది. వారికి నల్లగొండ జిల్లాలో పట్టిన గతే రాష్ట్రమంతా పడుతుందని ఎమ్మెల్యేలు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు.
చిట్యాల పట్టణ కేంద్రంలో మీడియా సమావేశంలో బీజేపీ తీరుపై వారు నిప్పులు చెరిగారు.
ధాన్యం కొనుగోలుపై నిర్లక్ష్యం చేసి రైతులను ఆగం చేశారు. ఇప్పుడు ఎరువుల ధరలను పెంచి రైతుల నడ్డివిరిచే ప్రయత్నం చేస్తోందని ఆ పార్టీని విమర్శించారు.
రాష్ట్రంలో రైతులకు కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుంది. పుష్కలంగా సాగునీరు, కరెంట్ ఉన్నాయి. దేశం మొత్తం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నదని వారు తెలిపారు. రాష్ట్ర బీజేపీ నాయకులు డ్రామాలు ఆపాలని సూచించారు.
మీకు దమ్ముంటే పెంచిన ధరలు తగ్గించాలని మీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలన్నారు. మీ వైఖరి మార్చుకోకుంటే మీకు తగిన గుణపాఠం చెపుతామన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ నాయకులు గ్రామాల్లో తిరగలేరన్నారు.
రాష్ట్రంలో ఉన్న చెత్త చెదారపు నాయకులను పొరకలతో తన్ని తరుముతామన్నారు. పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలి. తగ్గించని ఎడల మీ ఢిల్లీ పీఠాన్ని దించేంత వరకు సీఎం కేసీఆర్ సారధ్యంలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.