నల్లగొండ, ఏప్రిల్ 12 : జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షం అన్నదాతను ఉలిక్కిపడేలా చేసింది. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి పోసిన ధాన్యం కాపాడుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇంకా కోత దశలో ఉన్న పంటకు ఎలాంటి నష్టం జరుగుతదోనని ఆందోళన చెందారు. అయితే.. పది రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలతో నిప్పుల కొలిమిలా మారిన నల్లగొండ జిల్లా జనానికి కాస్త ఉపశమనం కలిగిందని చెప్పవచ్చు.
జిల్లాలో పది మండలాల్లో పాక్షిక వర్షం కురువడంతో పెద్దగా నష్టం జరుగకపోయినప్పటికీ అక్కడక్కడ పాక్షికంగా ధాన్యం తడిసింది. ఇక ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటి వరకు 63,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. అందులో 738 మెట్రిక్ టన్నులు మినహాయిస్తే మిగిలిన ధాన్యం మిల్లుల్లోకి తరలించడం వల్ల కొన్న వడ్లు పెద్దగా తడవలేదని అధికారులు అంటున్నారు. జిల్లాలో మొత్తం 370 కేంద్రాల్లో కొనుగోలు చేస్తుండగా ఇంకా లక్షన్నర మెట్రిక్ టన్నుల ధాన్యం ఆయా కేంద్రాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ధాన్యం తడవకుండా అన్నదాతలు ఎంతో ప్రయాస పడాల్సి వచ్చింది.
జిల్లాలో శుక్రవారం పది మండలాల్లో వర్షం కురువగా అత్యధికంగా కనగల్ మండలంలో 21.3 మి.మీ, వేములపల్లిలో 15.3, త్రిపురారంలో 13.3, తిప్పర్తిలో 5.8, నల్లగొండ, గుండ్లపల్లిలో 4.5 మి.మీ. వర్షం పడింది. చండూరు, చింతపల్లి, నాంపల్లి, దేవరకొండ మండలాల్లో 0.8 మి.మీ. వర్షం కురిసింది. దాంతో ఆయా మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పాక్షికంగా తడిసినట్లు అధికారులు, సెంటర్ నిర్వాహకులు అంటున్నారు. కొన్న ధాన్యంలో సింహభాగం ఇప్పటికే మిల్లులకు తరలించగా.. ఇంకా తూకం కాని వడ్లు ఎక్కువగా తడిసినట్లు తెలుస్తుంది.
జిల్లాలో పది రోజులుగా 43 నుంచి 45 డిగ్రీల మేరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో ప్రజలు ఈ ఎండ వేడిమికి తాళలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో కూలర్లు కూడా పని చేయని పరిస్థితుల్లో శుక్రవారం పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షం కాస్త ఉపశమనం కలిగించిందని చెప్పవచ్చు. పొద్దున దాకా ఎండతోపాటు ఉక్కపోత ఉన్నప్పటికీ సాయంత్రం పడ్డ వర్షం ఉపశమనం కలిగించింది. పది రోజులుగా సగటున 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, శుక్రవారం 39 డిగ్రీలకు పడిపోయింది.