సూర్యాపేట టౌన్, డిసెంబర్ 26 : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రజా పాలన సభల్లో పాల్గొని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. సూర్యాపేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ప్రజా తీర్పును గౌరవించి ఓటమిపై విశ్లేషణ చేసుకుంటామని అన్నారు. పదేండ్లుగా ప్రజలు అధికారం ఇస్తే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, ఇప్పుడు అధికారంలో లేకున్నా ప్రజల కోసం రెట్టింపు ఉత్సాహంతో ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని తెలిపారు. ప్రభుత్వ విధానాల్లో మంచి ఉంటే సహకరిస్తామని, చెడు ఉంటే పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సరైన పాలన చేయలేదని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అనడంలో వాస్తవం లేదని విమర్శించారు. రూ.3లక్షల కోట్ల అప్పులు చేస్తే కోట్లాది రూపాయల ఆస్తులను తయారు చేశామని చెప్పారు. 50ఏండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయని అభివృద్ధిని బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలోనే చేసిందని తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వేద పత్రం విడుదల చేశారని అన్నారు. ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ఉండి పని చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్కు సహకరించిన నాయకులు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, నాయకులు మల్లేశ్ పాల్గొన్నారు.