నల్లగొండ : దేవరకొండ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం దేవరకొండ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వార్డులలో మంచి నీటి సమస్యలు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
పట్టణంలో పారిశుద్ధ్య నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీనిచ్చారు. దేవరకొండ మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రతినెలా మున్సిపాలిటీలకు రూ.148 కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు.
ప్రణాళికా బద్దంగా పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. గతంలో నిర్వహించిన పట్టణ ప్రగతిలో భాగంగా పెండింగ్ లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సంక్షేమం విషయంలో ప్రభుత్వం రాజీపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
దేవరకొండ మున్సిపాలిటీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత నాదేనని హామీనిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహా, వైస్ చైర్మన్ రహత్ అలీ, కమిషనర్ వెంకటయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు హన్మంత్ వెంకటేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వాడిత్య దేవేందర్, కౌన్సిలర్లు తస్కిన్ సుల్తానా, మహమ్మద్ రైస్, మూడవత్ జయప్రకాష్ నారాయణ,చిత్రం శ్రీవాణి, పలేపు మల్లీశ్వరి, తదితరులు పాల్గొన్నారు