మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 10 : వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఆ మహనీయురాలి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణ కన్వీనర్ బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ అన్నారు. గురువారం ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక హనుమాన్ పేటలోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూస్వామ్య దోపిడీ, అణచివేత, అన్యాయానికి ఎదురు నిలిచిన తెలంగాణ పోరాట వీర వనిత ఐలమ్మ అన్నారు. సామాన్య పేద రజక కుటుంబంలో పుట్టిన ఐలమ్మ చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొని అన్యాయానికి తలవంచకుండా హక్కుల కోసం పోరాడారన్నారు. తెలంగాణ ప్రజలకు నూతన స్ఫూర్తిని, తెగువను అందించిందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు యర్రబెల్లి దుర్గయ్య రజక, బీసీ యువజన నాయకులు తుపాకుల తుకారాం, రజక తాడూరి సైదులు, రజక యర్రబెల్లి వెంకన్న, రజక సామాజికవేత్త ఉద్యమకారుడు ఎండీ మహమ్మద్ పాల్గొన్నారు.