– నవంబర్ 13–15 వరకు చారిత్రక గోష్టి
– 1,200 మందికి పైగా చరిత్రకారుల హాజరు
రామగిరి, సెప్టెంబర్ 10 : దక్షిణ భారత చారిత్రక విశిష్టతను వెలికితీసి ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో ఏర్పాటైన సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ 45వ సెషన్కు మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) ఆతిథ్యం ఇవ్వనుంది. నవంబర్ 13 నుండి 15 వరకు నిర్వహించనున్న ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు దేశ వ్యాప్తంగా 1,200 మందికి పైగా చరిత్రకారులు, అధ్యాపకులు హాజరై పరిశోధనా పత్రాలను సమర్పించనున్నారు. కార్యక్రమ సన్నాహక సమావేశంలో ఎంజీయూ ఉపకులపతి ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ.. సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ నిర్వహణ ఎంజీయూ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేయడంతో పాటు తెలంగాణ, దక్షిణ భారత చారిత్రక విశేషాలను దేశవ్యాప్త వేదికపై పరిచయం చేసేందుకు గొప్ప అవకాశమన్నారు.
వివిధ విభాగాలు తమకు సంబంధించిన చారిత్రక అంశాలపై పరిశోధనా పత్రాలు సమర్పించి సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చరిత్ర విభాగ బీఓఎస్ ఆచార్య విజయబాబు మాట్లాడుతూ సదస్సుకు 1,200 మందికి పైగా చరిత్రకారులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. అనంతరం సదస్సు పోస్టర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధికారులు, చరిత్ర విభాగ అధ్యాపకులు పాల్గొన్నారు.