ఢాకా: బంగ్లాదేశ్లోని హిందూ సాధువు చిన్మయ కృష్ణదాస్(Chinmoy Krishna Das) ప్రస్తుతం అక్కడి జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన మాతృమూర్తి సంధ్యా రాణి ధార్ కన్నుమూశారు. కానీ ఆమె తన చివరి కోరిక తీర్చుకోకుండానే ప్రాణం విడిచారు. చివరి క్షణాల్లో తన కుమారుడు చిన్నయ కృష్ణదాస్ను చూడాలని ఆమె ఆకాంక్షించారు. కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వం కృష్ణదాస్కు పెరోల్ ఇవ్వలేదు. 2024లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత బంగ్లాదేశ్ సనాతన జాగరణ్ మంచ్ ప్రతినిధిగా ఉన్న కృష్ణదాస్ను అరెస్టు చేశారు.
తల్లి మృతిచెందిన తర్వాత గురువారం కృష్ణదాస్కు 5 గంటల పాటు పెరోల్ జారీ చేశారు. చత్తోగ్రామ్లో ఉన్న శ్రీ శ్రీ పుండరిక్ ధామ్ ఆశ్రమంలో సంధ్యా రాణి కన్నుమూశారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె తన చివరి క్షణాలను కొడుకు ఆశ్రమంలోనే గడిపారు. జైలులో కృష్ణదాస్ ఆరోగ్యం క్షీణించినట్లు తెలుసుకున్న తమ తల్లి తీవ్ర మనోవేదనకు గురైనట్లు చిన్మయ సోదరుడు రంజన్ కుమార్ ధార్ తెలిపారు.
బంగ్లాదేశ్ జాతీయ జెండాను కించపరిచారన్న ఆరోపణలపై 2024, నవంబర్ 25వ తేదీన ఢాకా విమానాశ్రయంలో చిన్మయ కృష్ణదాస్ను అరెస్టు చేశారు. చిన్మయ అరెస్టుతో ఆయన మద్దతుదారులు, పోలీసుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది.