నీలగిరి, సెప్టెంబర్ 15 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా ప్రీ ప్రైమరీ స్కూల్ను ప్రవేశపెట్టి అంగన్వాడీ వ్యవస్థను పరోక్షంగా నిర్వీర్యం చేసే కుట్రను తిప్పి కొట్టాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి అన్నారు. సోమవారం అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్లగొండ గడియారం సెంటర్లోని మంత్రి క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ.. ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని, బోధనా బాధ్యత అంగన్వాడీ ఉద్యోగులకు కల్పించాలని, ఎఫ్ ఆర్ ఎస్ ను రద్దు చేస్తూ ఒకే ఆన్లైన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, 5జీ నెట్వర్క్ కలిగిన మొబైల్ ఫోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంగన్వాడీల వేతనం రూ.18 వేలు, పి.ఎఫ్.అమలు చేయాలని, ఐసిడిఎస్ మంత్రి హామీ ప్రకారం 24 రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వాలని, రిటైర్మెంట్ జీఓ 8ను సవరించి పెంచిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే అమలు చేయాలని కోరారు. మూడు నెలల పీఆర్సీ, మినీ టీచర్స్ కు 11 నెలల ఏరియర్స్ చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. రిటైర్మెంట్ అయిన వాళ్లకు 10 నెలల సిబిఈ బకాయిలు వెంటనే చెల్లించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలన్నారు. అంగన్వాడీ వ్యవస్థను పరోక్షంగా నిర్వీర్యం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని, అందులో భాగంగా ఈ నెల 25న చలో సెక్రటేరియట్ చేపట్టనున్నట్లు తెలిపారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా హైదరాబాద్ కు చేరుకోవాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 8న రాష్ట్ర వ్యాప్త సమ్మె, జిల్లా కేంద్రాల్లో 5 కిలోమీటర్లు పాదయాత్రలు చేయాలని, 17 నుండి ఫోన్లు అధికారులకు ఇచ్చేసి రిజిస్టర్స్ లో రాస్తూ ఆన్లైన్ సమ్మె నిర్వహించాలని రాష్ట్ర కమిటి నిర్ణయించిందని, అంగన్వాడీలంతా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పొడిసెట్టి నాగమణి, కార్యదర్శి బొందు పార్వతి, వర్కింగ్ ప్రెసిడెంట్ కె.విజయలక్ష్మి, భువనగిరి జిల్లా కార్యదర్శి రమ, ఉపాధ్యక్షులు మణెమ్మ, వివిధ ప్రాజెక్ట్ అధ్యక్ష కార్యదర్శులు సునంద, సైదమ్మ, ఫాతిమా, సరితా, స్వప్న, స్వరాజ్యం, సముద్రమ్మ, సుభాషిని, సునంద, ఎల్లమ్మ, జానమ్మ, సంధ్య, సిఐటియు నాయకులు మల్లు గౌతమ్ రెడ్డి, అవుట రవీందర్, లకపాక రాజు పాల్గొన్నారు.
Nilagiri : అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసి కుట్రలు మానుకోవాలి : తుమ్మల వీరారెడ్డి