నీలగిరి, జనవరి 19 : నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు ప్రజలకు మెరుగైన పాలన అందించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ కోరారు. ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు నేటి నుండి ఫిబ్రవరి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని టీటీడీసీలో ప్రారంభించి మాట్లాడారు. మొదటి విడత నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాలలోని మండలాలు, అలాగే తుంగతుర్తి నియోజకవర్గంలోని శాలిగౌరారం మండల సర్పంచులకు 5 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ముందుగా జిల్లా కలెక్టర్ నూతన సర్పంచులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజలు సర్పంచులకు కల్పించిన ఒక గొప్ప అవకాశం అన్నారు.
మహాత్మా గాంధీ చెప్పినట్లు గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. గ్రామాల్లో ప్రజా సమస్యలు తీర్చడంలో, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో సర్పంచులది కీలకపాత్ర అన్నారు. చట్టపరంగా సర్పంచుల హక్కులు, బాధ్యతలు, వివిధ ప్రభుత్వ పథకాల వివరాలు సమగ్రంగా తెలుసుకుని ప్రజలకు సుపరిపాలన అందించాలని ఆయన నూతన సర్పంచులను కోరారు. సర్పంచులు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారికి దక్కిన పదవీ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్, ఆర్డీఓ అశోక్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ కె.అనిల్ కుమార్, హైదరాబాద్ ట్రైనింగ్ సెంటర్ హెడ్ డి.రాఘవేంద్రరావు, డిపిఓ శంకర్ నాయక్, జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్ పాల్గొన్నారు.

Nilagiri : ప్రజలకు మెరుగైన పాలన అందించాలి : కలెక్టర్ బి.చంద్రశేఖర్