‘ట్రిపుల్ ఆర్ తెలంగాణకు మణిహారం. దీని ద్వారా పరిశ్రమలు వస్తాయి. రీజినల్ రింగ్ రోడ్డు రాయగిరి అలైన్మెంట్ మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే మళ్లీ సర్వే చేయిస్తాం. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ నిబంధనల ప్రకారం చేపడుతాం. సూటబుల్ పరిహారం అందిస్తాం. దీనిపై వారం తర్వాత నిర్ణయం తీసుకుంటాం’ ఇవీ జనవరి 21న కలెక్టరేట్లో సమీక్ష అనంతరం మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన వ్యాఖ్యలు.
‘ట్రిపుల్ ఆర్ రాయగిరి అలైన్మెంట్ మారుతుందా.. మారదా.. ఏడికి పోతుందనేది చెప్పం. తప్పకుండా ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూస్తాం. రైతులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాం. అవసరమై చోట్ల మార్పులు చేర్పులపై చర్చిస్తాం. ట్రిపుల్ ఆర్తో తెలంగాణ అభివృద్ధి చెందుతుంది’ బుధవారం ప్రెస్మీట్లో మంత్రి చేసిన కామెంట్స్.
యాదాద్రి భువనగిరి, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి రాయగిరి అలైన్మెంట్ మార్పుపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాటమార్చారు. అలైన్మెంట్ మార్పుపై జనవరిలో చెప్పిన మాటలకు పొంతన లేకుండా వ్యాఖ్యలు చేశారు. పరిహారం పెంచేందుకు ప్రయత్నం చేస్తామంటూ తప్పించుకున్నారు. దీంతో రాయగిరి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి దాకా మారుస్తామని ఇప్పుడు తప్పించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ట్రిపుల్ ఆర్ స్వరూపం ఇలా..
ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్లో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ నుంచి మెదక్, సిద్దిపేట జిల్లాల మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ వరకు హైదరాబాద్ ఉత్తర భాగంలో తొలి విడుతలో రీజినల్ రోడ్డు నిర్మించనున్నారు. 159 కిలోమీటర్ల మేర 100 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించారు. జిల్లాలోని చౌటుప్పల్, వలిగొండ, భువనగిరి, యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల పరిధిలోని 34 రెవెన్యూ గ్రామాల్లో భూసేకరణ చేపట్టనున్నారు. ఇప్పటికే త్రీడీ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. త్వరలో త్రీజీ నోటిఫికేఫన్ కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మోసం చేసిన కాంగ్రెస్
ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు కోసం రాయగిరి రైతులు అనే విధాలుగా ఉద్యమాలు చేశారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ రైతులను రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేసింది. అనేక సార్లు ఉద్యమానికి ఆ పార్టీ నేతలు మద్దతు పలికారు. అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మార్పిస్తామని హామీ ఇచ్చారు. ఏకంగా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే అలైన్మెంట్ మార్పిస్తామని బహిరంగంగా ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. అనేక సందర్భాల్లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మద్దతుగా నిలిచి మార్చాలని డిమాండ్ చేశారు. నాడు భువనగిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏకంగా ధర్నాలో పాల్గొన్నారు. కానీ తీరా అధికారంలోకి వచ్చాక రైతులను పట్టించుకోవడమే మానేశారు.
ఆందోళనలో రైతులు..
కాంగ్రెస్ పార్టీ తమను నమ్మించి మోసం చేసిందని రాయగిరి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలైన్మెంట్ మారుస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు పరిహారం పెంచుతామనడం ఏంటని మండిపడుతున్నారు. ఇప్పటికే మూడు దఫాలుగా భూములను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులను నమ్మితే తడిగుట్టతో గొంతు కోస్తున్నారని వాపోతున్నారు. కోర్టులోనే బలంగా కొట్లాడుదామని, మరోదఫా ఉద్యమానికి నాంది పలుకాలని రైతులు భావిస్తున్నారు.
రెండు నెలల్లోనే మంత్రి యూటర్న్..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి చేపట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తొలిసారి జిల్లాకు విచ్చేసిన సందర్భంగా జనవరి 21న కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో ట్రిపుల్ ఆర్పై మాట్లాడారు. రాష్ర్టాన్ని మూడు జోన్లుగా విభజించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని, అలైన్మెంట్ మార్పునకు చర్యలు తీసుకుంటామని, త్వరలోనే మళ్లీ సర్వే చేయిస్తామని ప్రకటించారు. మంత్రి చెప్పి నెలన్నర దాటినా ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా బుధవారం భువనగిరి వచ్చిన మంత్రి ఈ సారి యూటర్న్ తీసుకోవడం విశేషం. అసలు అలైన్మెంట్ మార్పు గురించి మేం చెప్పం.. అంటూ దాటవేశారు. దాంతో అక్కడున్న విలేకర్లు ముక్కున వేలేసుకున్నంత పనైంది.