నల్లగొండ రూరల్, మార్చి 6 : అన్నదాతలకు దశాబ్దం క్రితం కనిపించిన కరువు మళ్లీ తాండవిస్తున్నది. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నుంచి నీరు అందక, మరో వైపు భూగర్భ జలాలు అడుగంటడంతో సాగు నీటి సమస్య నెలకొన్నది. యాసంగిలో వరి వేసిన రైతులకు నిరాశే మిగులుతున్నది. వర్షాభావ పరిస్థితుల కారణంగా బోర్ల నుంచి నీరు రావడం లేదు. వ్యవసాయ బావుల్లో పూడిక తీసినా నీటి ఊట కనిపించడం లేదు. దాంతో నల్లగొండ మండలంలోని రసూల్పురం గ్రామంలో ఈ యాసంగికి సాగు చేసిన వరి పంటలు 90 శాతం మేర ఎండిపోయాయి. దిక్కుతోచని స్థితిలో రైతులు ఎండుతున్న వరి చేన్లను బర్రెలు, గొర్రెల మేత కోసం పెంపకందారులకు ఇస్తున్నారు.
ఎండిన చెరువులు
రసూల్పురంలో వరి 1,483 ఎకరాల్లో వరి, 73 ఎకరాల్లో వివిధ రకాల తోటలు సాగు చేస్తున్నారు. గ్రామానికి ఇరు వైపులా ఊరకుంట చెరువు, సవటకుంట చెరువు, నర్సప్ప చెరువు, కర్నాటి కుంట చెరువులు ఉన్నాయి. సాగర్ ఎడమ కాల్వ ద్వారా నీటిని విడుదల చేస్తే ఈ నాలుగు చెరువులు నిండుకుండలా ఉండేవి. దాంతో గ్రామ పరిసర ప్రాంతాల్లోని బోర్లు పుష్కలంగా పోసేవి. ఇప్పుడు ఆ చెరువులు పూర్తిగా ఎండిపోవడం, సాగునీరు రాకపోవడంతో బోర్లు అడుగంటి పోయాయి. గత ప్రభుత్వం కాలంలో ఇంతటి దుస్థితి ఎప్పుడూ రాలేదని స్థానిక రైతులు ఆవేదన వ్యక్త చేస్తున్నారు.
8 ఎకరాల వరి పొలం ఎండిపోయింది
నేను ఎవుసం మొదలు పెట్టి 15 ఏండ్లవుతున్నది. ఆనాటి కరువు మల్ల గిప్పుడు వచ్చింది. మాకు 14 ఎకరాలు ఉంటే ఈ యాసంగికి 10 ఎకరాల్లో వరి వేసినం. 5 బోర్లు మొత్తం అడుగంటి పోయినయి. నీళ్లు లేక 8 ఎకరాల వరి పొలం ఎండిపోయింది. దాంట్లో నాకున్న నాలుగు బర్రెలను మేతకు వదిలేసిన. రాబోయే రోజుల్లో ఎట్లుంటదో భయమేస్తున్నది. ఎండిపోయిన పంటలకు ప్రభుత్వాలు అదుకోవాలి.
-గుండెబోయిన లింగయ్య యాదవ్, రైతు, రసూల్పురం, నల్లగొండ మండలం
ఎండిన పొలంలో గొర్రెలు మేపుతున్నా
మాకు రెండు ఎకరాలు ఉంటే అందులో వరి సాగు చేసిన. మూడు బోర్లు ఉండే. అవి పూర్తిగా అడుగంటి పోయినయి. 280 ఫీట్లతో ఒక బోరు వేసినా నీళ్ల చుక్క పడలే. పంట మొత్తం ఎండిపోయింది. చేసేదేం లేక అందులో మా గొర్రెలను మేపుతున్నాం. మా ఊర్లో చాలా పొలాలు నీళ్లు లేక ఎండిపోయినయి.
-బొమ్మెనబోయిన జానమ్మ, రైతు రసూల్పురం, నల్లగొండ మండలం