ఒకప్పటి బీడు భూముల్లో గోదావరి జలాల పరుగులు.. నేడు పచ్చని పంట పొలాలతో రైతుల మోమున చిరునవ్వు.. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంకల్పం, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి కృషితో ఆలేరు నియోజకవర్గంలో ప్రగతి పరుగులు పెడుతున్నది. నాలుగున్నరేండ్లలో రూ.3,150 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. గతంలో గుంతల రోడ్లతో అవస్థలు పడిన గ్రామాల్లో అద్భుతమైన రహదారులు నిర్మించారు. మిషన్ కాకతీయ, చెక్డ్యామ్ల నిర్మాణంతో గణనీయంగా భూగర్భ జలాలు పెరిగాయి. ఇంటింటికీ మిషన్ భగీరథతో తాగునీటి గోస తీరింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలు నియోజకవర్గానికి చేరాయి. యాదగిరిగుట్టలో గండి చెరువును నింపగా, తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లో సాగునీటి అవసరాలు తీర్చుతున్నది. చరిత్రలో నిలిచిపోయే విధంగా రూ. 1,280 కోట్లతో యాదగిరి గుట్ట ఆలయాన్ని సీఎం కేసీఆర్ అద్భుతంగా నిర్మించారు. రూ. 21 కోట్లతో యాదగిరిగుట్ట, రూ. 26.32 కోట్లతో ఆలేరు మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. ఆలేరు పట్టణం, మోటకొండూర్, బొమ్మలరామారం మండలం చీకటిమామిడిలో కార్పొరేట్కు దీటుగా గురుకుల పాఠశాలలు కొనసాగుతున్నాయి. యాదగిరిగుట్ట పట్టణంలోని పీహెచ్సీని 100 పడకల దవాఖానగా అప్గ్రేడ్ చేస్తూ
ప్రభుత్వం రూ. 45.79 కోట్లు మంజూరు చేసింది.
ఆలేరు నియోజకవర్గంలో గతంలో ఎక్కడ చూసినా బీడుబారిన భూములే దర్శనమిచ్చేవి. చుక్కనీళ్లు ఉండేవి కాదు. వాగులున్నా ఒడిసిపట్టలేని దుస్థితి. బతుకు జీవుడా అని వలసలు వెళ్లే పరిస్థితి. గుంతల రోడ్లు, ఎప్పుడొస్తదో, ఎప్పుడు పోతదో తెలియని కరంటు.. ఇదీ ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఆలేరు నియోజకవర్గం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. గతంతో పోలిస్తే వంద రెట్ల అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తున్నది. కాళేశ్వరం జలాలు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణతో నీట వనరులు కళకళలాడుతున్నాయి. మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా నీళ్లు వస్తున్నాయి. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వృత్తిదారులకు ఆసరా పింఛన్లు అందుతున్నాయి. పేదింటి ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సాయం అందుతున్నది. మున్సిపాలిటీల అభివృద్ధి, అద్దంలా మెరిసే రోడ్లు, రైతు వేదికలు, చింతలు తీర్చిన వంతెనలు, చెక్డ్యామ్లు, గురుకుల పాఠశాలలు ఇలా ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆలేరు చెంతకు చేరి నియోజవర్గం అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నది.
– యాదగిరిగుట్ట, మార్చి 24
ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకునే పాలకులు లేక నియోజకవర్గ వ్యాప్తంగా బుక్లేర్, చొల్లేరు, బిక్కేరువాగులతోపాటు ఆలేరు పెద్దవాగు, పెద్దకందుకూరు వాగులో నీళ్లు వృథాగా పోయేవి. ఎక్కడికక్కడ బోర్లు ఎండిపోయేవి. నీరు లేక సాగు అంతంత మాత్రమే సాగేది. కానీ, సీఎం కేసీఆర్ పాలనలో పరిస్థితులు మారాయి. ప్రభుత్వ విప్ ప్రత్యేక చొరవతో ఆయా వాగులపై రూ. 13.85 కోట్లతో 23 చెక్డ్యాంలు నిర్మించారు. తాజాగా మరో 11 చెక్డ్యాంల నిర్మాణానికి రూ. 29.65 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిర్మాణాలతో పల్లెల్లో ఎక్కడ చూసినా జలదృశ్యాలే దర్శనమిస్తున్నాయి. భూగర్భజలాలు పెద్ద ఎత్తున పెరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో బ్రిడ్జిలు లేకపోవడంతో మోస్తరు వానలకే ఉన్న మట్టి రోడ్లు దుర్భరంగా ఉండేవి. గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయేవి. పని మీద పక్క ఊర్లకు వెళ్లినవాళ్లు అక్కడే ఇరుక్కుపోయేవారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి ప్రత్యేక విజన్తో నియోజకవర్గంలోని ఆత్మకూరు(ఎం)లో రూ.4 కోట్లతో, గుండాల మండలం సుద్దాల గ్రామంలో బిక్కేరువాగుపై రూ.14 కోట్లతో చెక్డ్యాంతో కూడిన వంతెనలు పూర్తయ్యాయి.
నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగు జలాలు అందుతున్నాయి. జిల్లాకు వచ్చే జీఎల్బీఆర్ ట్యాంకు తుర్కపల్లి మండల కేంద్రంలోనే ఉంది. అక్కడి నుంచి ఆవాస మండలాలైన యాదగిరిగుట్ట, ఆలేరు, మోటకొండూరు, ఆత్మకూరు(ఎం), రాజాపేట, గుండాల, బొమ్మలరామారం మండలాలకు జలాలు వస్తున్నాయి. గ్రామాలు, మున్సిపాలిటీలు కలిపి 324 ఆవాస గ్రామాలకు గానూ 74,306 ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు. మిషన్ భగీరథ పథకం కింద ప్రస్తుతం ఉన్న 277 ట్యాంకులకు అదనంగా 216 నిర్మించారు. 1,022.6 కిలోమీటర్ల మేర గ్రిడ్ పైప్లైన్ వేసి ప్రతి గ్రామంలో ట్యాంకులకు శుద్ధి చేసిన గోదావరి, కృష్ణా జలాలు సరఫరా చేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.7,992.11 లక్షలు ఖర్చు చేసింది. అంతేకాకుండా ప్రభుత్వ సంస్థలు, గ్రామ పంచాయతీలు, వైకుంఠధామాలకూ మిషన్ భగీరథ నీళ్లు అందిస్తున్నారు.
ఆలేరు నియోజకవర్గ విద్యార్థులు ఒక్కప్పుడు పై చదువుల కోసం భువనగిరి, హైదరాబాద్కు వెళ్లాల్సి ఉండేది. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటుచేశారు. 2017లో ప్రభుత్వం గురుకుల పాఠశాలలు ప్రారంభించింది. ఆలేరు, మోటకొండూరు, చీకటిమామిడిలో గురుకల పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఆలేరు పట్టణంలో మైనార్టీ గురుకుల పాఠశాలలో సుమారు 350 మంది విద్యార్థినులు, మోటకొండూరులో మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో సుమారు 640 విద్యార్థినులు, బొమ్మలరామారం మండలం చీకటిమామిడిలో మహాత్మాజ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకల పాఠశాలలో 480 విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. యాదగిరిగుట్టలో పాలిటెక్నిక్, ఇంటర్మీడియట్ కళాశాలలు, ఆలేరు పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైతం అందుబాటులోకి రావడంతో ఇక్కడి విద్యార్థులు ఉన్నత చదువులపై మరింత ఆసక్తి చూపుతున్నారు. మన ఊరు-మన బడి పథకం కింద ఆలేరు నియోజకవర్గంలో 106 ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణకు రూ.11.71 కోట్లు మంజూరయ్యాయి.
మిషన్ కాకతీయ పథకంతో నియోజకవర్గంంలోని 579 చెరువులు పూర్వవైభవం సంతరించుకున్నాయి. చెరువుల్లో పూడికతీత, కట్టల పటిష్టత, కంపచెట్ల తొలగింపు, ఫీడర్ చానళ్ల పునరుద్ధరణతో నీటితో కళకళలాడుతున్నాయి. మూడు విడుతల్లో 579 చెరువులు, కుంటల ఆధునీకరణకు రూ.112.35 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం చెరువు, సైదాపురం చెరువు, యాదగిరిగుట్ట పట్టణంలోని గండిచెరువును రూ.6.77 కోట్లతో మినీ ట్యాంక్బండ్లుగా ఆధునీకరించింది. ఎండాకాలంలో సైతం చెరువులు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. గతంతో పోలిస్తే సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. 1,15,195 ఎకరాల విస్తీర్ణం సాగులోకి వచ్చింది.
రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతుల మోముల్లో ఆనందం కనిపిస్తున్నది. ఒకవైపు సాగుజలాలు, సకాలంలో ఎరువులు, 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరాతోపాటు రైతు బంధ పథకం ద్వారా పెట్టుబడి సాయం, మృతి చెందిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల చెక్కులు అందజేస్తున్నారు. రైతు బంధు పథకం ద్వారా ఏటా 98,519 మంది రైతులకు రూ.114.92 కోట్లు, రైతుబీమా ద్వారా 1,014 రైతు కుటుంబాలకు రూ.50.70 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. నియోజకవర్గంలో 37 ఏఈఓ క్లస్టర్లలో రైతు వేదికలు నిర్మించారు. ఇందులో ప్రతి మంగళ, శుక్రవారాల్లో రైతులకు పంటల మార్పిడి, పచ్చిరొట్టి వాడకం, వరి విత్తనాలు తదితర అంశాలపై అవగాహన
కల్పిస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా పరిధిలో ఒక్కటే మున్సిపాలిటీ ఉండేది. స్వరాష్ట్రం సిద్ధించాక ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో 2018లో యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీలుగా మారి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో రూ.21.01 కోట్లతో ఆలేరు మున్సిపాలిటీలో రూ.26.32 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. అంతర్గత రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, ఇంటిగ్రేటెడ్ మారెట్లు నిర్మిస్తున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా రెండు మున్సిపాలిటీల్లో పబ్లిక్ టాయిలెట్లు, పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. డంపింగ్ యార్డులు, వైకుంఠధామాల పనులు జరుగుతుండగా క్రీడా ప్రాంగణాలను పూర్తి చేశారు.
2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి సాగు జలాలపై ప్రత్యేక దృష్టిసారించారు. దేవాదుల ఎత్తిపొతల పథకం కింద నిర్మించిన నవాబ్పేట రిజర్వాయర్ నుంచి ప్రత్యేక కాల్వ ద్వారా గుండాaల మండలానికి సాగుజలాలు తీసుకొచ్చారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ 16వ ప్యాకేజీ నృసింహసాగర్ జలాశయం నుంచి యాదగిరిగుట్ట గండిచెరువులోకి గోదావరి జలాలు వచ్చి చేరాయి. 2020లో కొండపోచమ్మ సాగర్ నుంచి తుర్కపల్లి ప్రధాన కాల్వ ద్వారా తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాలకు సాగుజలాలు వచ్చాయి. ఈ నెల 11న మన్నెవారి తుర్కపల్లి ప్రధాన కాల్వ సైతం అందుబాటులోకి వచ్చింది.
చరిత్రలో నిలిచేలా యాదగిరిగుట్ట ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పునర్నిర్మించారు. స్వతంత్ర భారతచరిత్రలో మొదటిసారిగా ప్రభుత్వం రూ.1,280 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన అతి పెద్ద దేవాలయం యాదగిరిగుట్ట. ప్రధానాలయం తూర్పు రాజగోపురం వద్ద 2015లో దసరా రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టగా 2022 మార్చి 28న సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రధానాలయం పునః ప్రారంభమైంది. గర్భాలయం, ముఖమండపం, మహామండపాలు పూర్తిగా కృష్ణశిలలతో నిర్మించడం ప్రపంచంలోనే ప్రథమంగా చెప్పవచ్చు. దాదాపు వెయ్యేండ్ల వరకు చెక్కుచెదరకుండా ఆలయ నిర్మాణాలు జరిగాయి.
కొవిడ్ విజృంభించిన సమయంలోనూ పేదల సంక్షేమం ఆగలేదు. యాదగిరిగుట్ట పట్టణంలోని పీహెచ్సీని 100 పడకల దవాఖానగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం రూ.45.79 కోట్లు మంజూరు చేసింది. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా పల్లె దవాఖానల పక్కా భవనాల కోసం 13 దవాఖానలకు రూ.2.60 కోట్లు మంజూరు కాగా పనులు జరుగుతున్నాయి. సీఎం సహాయ నిధి పథకం అమలులో రాష్ట్రంలోనే నియోజకవర్గం మందు వరుసలో నిలిచింది. సుమారు 4,500 మంది బాధితులకు సుమారు రూ.12.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి సొంత నిధులతో ఆలేరు పట్టణంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి గత మూడున్నరేండ్లుగా 100 మందికి ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లను చూస్తే ఔరా! అనక తప్పదు. ప్రధాన రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి. గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణంతో పల్లెలు సుందరంగా దర్శనమిస్తున్నాయి. ఆర్అండ్బీ, ఈజీఎస్, ఎస్డీఎఫ్, పంచాయతీరాజ్, రాష్ట్ర ప్రణాళిక నిధులు 279.34 కోట్లతో నూతన బీటీ రోడ్లతోపాటు బీటీ రెన్యూవల్, అంతర్గత రోడ్లు, సీసీ రోడ్లు పూర్తయ్యాయి. రూ. 76.33 కోట్లతో కమ్యూనిటీ భవనాలు, అశురఖానాలు, నూతన పంచాయతీ భనవనాలు, పాఠశాలల్లో అదనపు గదులు, విద్యుత్ సబ్స్టేషన్లు, స్త్రీ శక్తి భవనాలు, పశువైద్యశాలలతోపాటు ఇతర భవనాలు పూర్తయ్యాయి.
పేదల సొంతింటి కలను రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేస్తున్నది. పైసా ఖర్చు లేకుండా ఇండ్లను నిర్మించి ఇస్తున్నది. గత ప్రభుత్వాలకు భిన్నంగా డబుల్ బెడ్రూం ఇండ్లను అందిస్తున్నది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఖర్చు చేస్తున్నది. నియోజకవర్గానికి మొదటి విడుతలో భాగంగా 988 ఇండ్లు మంజూరు కాగా నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇప్పటికే కొన్నిచోట్ల ఇండ్లను పంపిణీ చేయగా మరికొన్ని చోట్ల ఇండ్లలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
కల్యాణలక్ష్మి పథకంతో నియోజకవర్గంలోని పలు పేద కుటుంబాల్లో కల్యాణకాంతులు వెల్లివిరిశాయి. ఒక్కప్పుడు ఆడబిడ్డ పెండ్లి చేయాలంటేనే భయపడే రోజుల నుంచి చిరునవ్వుతో తల్లిదండ్రులు తమ కూతుళ్లను అత్తాగారింటికి పంపుతున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గ వ్యాప్తంగా 14,791 మంది కుటుంబాలకు కల్యాణలక్ష్మి పథకం కింద 13,18,66,246 రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది.
గత 9 ఏండ్లలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ముఖ్యంగా మహిళలకు కేసీఆర్ కిట్, అమ్మఒడితోపాటు సబ్బండ వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ముఖ్యంగా ప్రజల కంటిచూపును మెరుగుపరిచేందుకు కంటి వెలుగు కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమానికి అద్బుతమైన స్పందన వచ్చింది. యాదగిరిగుట్టలో ప్రతిష్టాత్మకంగా 100 పడకల దవాఖాన ప్రారంభంకానుంది. నియోజకవర్గంలో మూడు గురుకుల పాఠశాలలతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నాం. ముఖ్యంగా ఆలేరు ఒక్కప్పుడు బీడుబారిన ప్రాంతంగా ఉండేది. వర్షాలు వస్తే తప్పా ఇక్కడ నీళ్లు లేని పరిస్థితి. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో కాళేశ్వరం జలాలను నియోజకవర్గానికి తీసుకొచ్చాం. ఇప్పటికే తుర్కపల్లి, బొమ్మలరమారం మండలాల్లో కొండపోచమ్మసాగర్ జలాశయం నుంచి చెరువులు నింపాం. యాదగిరిగుట్టకు నృసింహసాగర్ నుంచి జలాలు వచ్చాయి. రాబోయే రోజుల్లో ఆలేరుకు అశ్వరావుపల్లి కాల్వ, గుండాలకు నవాబ్పేట కాల్వ, ఆత్మకూరు(ఎం), మోటకొండూర్ మండలాలకు బునాదిగాని కాల్వ ద్వారా గోదావరి జలాలు అందిస్తాం. నియోజకవర్గంలోని 8 మండలాలకు సాగుజలాలు తీసుకొస్తాం.
– గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే
వ్యవసాయం చేయాలంటే నీళ్లే ముఖ్యం. గతంలో వ్యవసాయానికి నీళ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడేవాళ్లం. మా వ్యవసాయ బావి పక్కనే బిక్కేరు వాగు ఉంది. అప్పట్లో వర్షం వచ్చిన నీళ్లు వాగులో వృథాగా పోయేవి. వాగులో మోటర్లు పెట్టి పంటకు అందిచేవాళ్లం. కేసీఆర్ సార్ వచ్చినంక బిక్కేరు వాగుపై చెక్డ్యాం నిర్మించారు.దాంతో ఇప్పుడు బావుల్లో నీళ్లు సమృద్ధిగా ఉంటున్నాయి. 24 గంటల విద్యుత్, సకాలంలో ఎరువులు, పంట పెట్టుబడి సాయంతో సంతోషంగా వ్యవసాయం చేస్తున్నాం.
-కట్టెకోల, వెంకన్న, రైతు, మోదుగుబావిగూడెం, ఆత్మకూరు(ఎం)
గతేడాది నా భర్త గాజుల సిద్ధులు తాటిచెట్టు పైనుంచి కింద పడి మృతి చెందాడు. కులవృత్తిని నమ్ముకుని, వ్యవసాయం చేసుకుంటూ జీవించే మాకు ఆయన మరణం తీవ్రంగా కుంగదీసింది. ఆర్థికంగా ఇబ్బందిపడాల్సి వస్తుందని ఎంతో భయపడ్డాను. ఈ సమయంలో రైతుబీమా పథకం నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. నా భర్త చనిపోయిన నెలలోపే ప్రభుత్వం రూ.5 లక్షలు నా ఖాతాలో వేసింది. నాకు కూతురు, కుమారుడు ఉన్నారు. వారి ఉన్నత చదువులకు ఈ డబ్బును ఉపయోగిస్తా.
-గాజుల భాగ్య, మహబూబ్పేట, యాదగిరిగుట్ట