త్రిపురారం, ఫిబ్రవరి 11 : మండలంలోని పాల్తితండా, పలుగు గ్రామాల్లో శని, ఆదివారాల్లో కోడిపందేలు జోరుగా నిర్వహిస్తున్నారు. మధ్యా హ్నం 2 గంటల నుంచి రాత్రి 7,8 గంటల వరకూ కోడి పందేలు నిర్వహిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. రూ. వెయ్యి నుంచి రూ. 20 వేలు, రూ. 30 వేల వరకు యువకులు పందేలు వేస్తు న్నారు. ముఖ్యంగా కోడి పందేలు నిర్వహించే స్థలం వద్దకే కొందరు మందు తెచ్చి పేకాట సైతం ఆడుతున్నారని మహిళలు వాపోతున్నారు. కోడిపందేల నిర్వాహకులు మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని ఎవరైనా వస్తున్నారేమో తెలుసుకుంటూ జోరుగా కోడి పందేలు నిర్వహిస్తున్నారు.
ఇతర మండలాల నుంచి యువకుల రాక
ఆయా గ్రామాల్లో కోడి పందేలకు త్రిపురారం మండలం నుంచే కాకుండా మిర్యాలగూడ, దామరచర్ల, నల్లగొండ, తదితర ప్రాంతాల నుంచి యువకులు, కొందరు చోటా రాజకీయ నాయకులు వస్తున్నట్లు సమాచారం. అయితే కోడి పందేలు ఒకేచోట కాకుండా పలుచోట్ల నిర్వహిస్తున్నట్లు వినికిడి. పాల్తితండా గ్రామం ఫారెస్ట్ను ఆనుకొని ఉండటంతో గట్టు వెంబడి పొలాలను అడ్డుగా చేసుకుని నిర్వాహకులు కోడి పందేలు నిర్వహిస్తున్నారని, పందేల కోసం వచ్చే వారికి నీళ్లు, బండ్లు పెట్టుకోవడానికి పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు పలువురు చెబుతున్నారు.
పట్టించుకోని అధికారులు
మండలంలో చాలాకాలంగా కోడి పందాలు నిర్వహిస్తున్నా అధికారులు, పోలీసులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు.అనేకమార్లు పందేల వద్ద గొడవలు కూడా జరిగాయని, అక్కడికి వచ్చిన వారు కొట్టుకోవడంతో తాము ఇబ్బంది పడుతున్నారని మహిళలు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు, పోలీసులు స్పందించి గ్రామాల్లో కోడి పందేలు అడ్డుకో వాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.