సూర్యాపేట, జనవరి 18 (నమస్తే తెలంగాణ) : స్వరాష్ట్రంలో పల్లెలు పచ్చగా, పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం సత్ఫలితాలిచ్చింది. నెలనెలా నిధులు ఇవ్వడంతో పల్లెల్లో మురుగు వాసన లేదు.. గుంతల రోడ్లు పోయాయి. వీధులు, రోడ్లకు ఇరువైపులా పచ్చని తోరణంలా మొక్కలు.. ఊరికో పల్లె ప్రకృతి వనం, మండలానికో మెగా ప్రకృతి వనంతో పచ్చదనం ఉట్టిపడుతున్నది. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించి డంప్ యార్డులకు తరలించడంతో గ్రామాలు పరిశుభ్రంగా మారాయి.
వీటికితోడు గ్రామపంచాయతీ అవసరాలకు ట్రాక్టర్, నాటిన మొక్కలకు నీళ్లు పోసేందుకు ట్యాంకర్లు కొనుగోలు చేశారు. జిల్లాలోని 475 గ్రామ పంచాయతీలకు 2019 సెప్టెంబర్ నుంచి 2023 నవంబర్ వరకు రూ.362 కోట్లు విడుదలయ్యాయి. అయితే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పల్లె ప్రగతి కార్యక్రమం కొనసాగేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు మంత్రులు ఖజానా ఖాళీ అంటుండడం పట్ల పల్లె ప్రగతికి నిధుల విడుదలపై నీలి నీడలు అలుముకుంటున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఊరికి పోయినా మురుగు నీటి గుంతలు.. అందులోనే మంచినీటి నల్లాలు.. వీధు ల్లో చెత్త కుప్పలు, పిచ్చి మొక్కలు.. పాడు బడిన బావులు దర్శనమిచ్చేది.
కూలిన ఇండ్లు.. రోడ్లపైకి వచ్చే మురుగు నీటితో దోమలు, ఈగలు, ఇతర కీటకాలతో జనం అనారోగ్యం పాలయ్యేది. స్వరాష్ట్రంలో కేసీఆర్ పదేండ్ల పాలనలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గ్రామాలు పచ్చగా, పరిశుభ్రంగా మారాయి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు గ్రామాలు, పట్టణాల రూపు రేఖలను సమూలంగా మార్చేశాయి.
తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం గ్రామాల అభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగింది. నాడు ఊర్లల్లో ఏదైనా పని చేయాలంటే నయా పైసా ఉండకపోయేది. కానీ.. స్వరాష్ట్రంలో పదేండ్లుగా ప్రతి పంచాయతీకి నెల నెలా రూ.13 నుంచి రూ.8కోట్ల వరకు అందాయి. 2019 సెప్టెంబర్ నుంచి 2023 నవంబర్ వరకు 475 పంచాయతీలకు రూ.362 కోట్లు విడుదలయ్యాయి. స్టేట్ ఫైనాన్స్ నుంచి రాష్ర్టానికి ప్రతి నెలా రూ.339 కోట్లు విడుదల కాగా, అన్ని జిల్లాలకు జనాభా ప్రాతిపదికన ఇచ్చారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పల్లె ప్రగతి కొనసాగింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలతో పాటు ప్రధాన అంశాల్లో పల్లె ప్రగతి కొనసాగింపుపై స్పష్టత లేదు. ఇప్పటికే యాసంగి సాగు సీజన్ ప్రారంభమై రెండు నెలలు అవుతున్నా రైతులకు పెట్టుబడి సాయం అందించకపోవడంతో పల్లె ప్రగతికి నిధులు ఇస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం పల్లె ప్రగతి నిధులతో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, డంప్ యార్డులు, శ్మశాన వాటికలు నిర్మించడంతోపాటు ట్రాక్టర్లు, ట్యాంకర్లు సమకూర్చగా మళ్లీ నెలనెలా నిధులు వస్తే పల్లెలు మరింత సౌభాగ్యంగా మారనున్నాయి. మరి రేవంత్ ప్రభుత్వం నిధులు ఇస్తుందో.. లేదో వేచి చూడాలి.