మిర్యాలగూడ : స్వరాష్ట్రంలోని గ్రామాలను ప్రగతి పథంలో నడిపించాలనే సంకల్పంతో ప్రభుత్వం ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తోందని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. దీంతో పల్లెల్లో ప్రగతి విప్లవం కొనాగుతుందన్నారు.
మిర్యాలగూడ మండల పరిధిలోని శ్రీనివాస్ నగర్ గ్రామంలో రూ.20 లక్షల నిధులతో గ్రామ పంచాయతీ భవనం, బోగవెల్లి సునీత జ్ఞాపకార్ధం ఆమె భర్త, గ్రామ సర్పంచ్ బోగవెల్లి వెంకట రమణ చౌదరి రూ.25లక్షల వ్యయంతో అతిథి గృహాన్ని నిర్మించారు.
వీటితో పాటు గ్రామ పంచాయతీ నిధుల నుంచి రూ.3 లక్షలతో అధునాతన గ్రంథాలయాన్ని, 5లక్షల రూపాలయల నిధులతో పల్లె ప్రకృతి వనాన్ని, రూ.2లక్షల నిధులతో మోడల్ స్కూల్ లో కిచెన్ షెడ్, బోగవెల్లి సునీత జ్ఞాపకార్ధం భర్త సర్పంచ్ బోగవెల్లి వెంకట రమణ చౌదరి రూ.3లక్షల వ్యయంతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు.
నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, పల్లె ప్రకృతి వనం, గ్రంథాలయం, ఇతర నిర్మాణాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నల్లమోతు భాస్కర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శిథిలావస్థకు చేరిన గ్రామ పంచాయతీల స్థానాల్లో నూతన భవనాల నిర్మాణాలను చేపట్టామని అన్నారు.
పల్లెల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించాలనే సంకల్పంతో ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను నిర్మించిందన్నారు.
మానసిక, శారీరక వికాసాన్ని పెంపొందించేందుకు ఓపెన్ జిమ్ లు ఉపకరిస్తాయని పేర్కొన్నారు. గ్రామాల్లోనూ అధునాతన గ్రంథాలయాల ఏర్పాటుపై దృష్టి సారించినట్టు తెలిపారు. గ్రామాల సమగ్రాభివృద్ధిలో దాతలు కూడా భాగస్వామ్యం కావొచ్చని కోరారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహా రెడ్డి, ఎంపీడీవో గార్లపాటి జ్యోతిలక్ష్మి, సర్పంచ్ బోగవెల్లి వెంకటరమణ చౌదరి, ఎంపీటీసీ సుజాత బాలు, మాజీ సర్పంచ్ చిలుకూరు సత్యనారాయణ, గ్రామ శాఖ అధ్యక్షుడులు వాసంశెట్టి గోవిందు, మామిడిపల్లి కృష్ణ, మేడిశెట్టి కృష్ణ, దైద రేణుక, పాల్గొన్నారు.