రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పండుగలా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మండల కేంద్రాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద జాతీయ జెండాలు ఎగురవేశారు. పల్లె ప్రగతిని చాటుతూ ర్యాలీలు నిర్వహించారు. కళాకారుల నృత్యాలు అలరించాయి. అనంతరం పారిశుధ్య కార్మికులను సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు.
అలాగే పల్లె ప్రగతిలో చేపట్టిన డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలను పరిశీలించారు. ఆలేరు నియోజకవర్గం గుండాలలో పల్లె ప్రగతి దినోత్సవంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి పాల్గొన్నారు. గరిడేపల్లి మండలం పొనుగోడులో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, నిడమనూరు మండలం ఊట్కూరులో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు
పాల్గొన్నారు.
– నమస్తేతెలంగాణ నెట్వర్క్, జూన్ 15