మృతులు..
బొల్లు సమ్మయ్య (38),
స్రవంతి, సమ్మయ్య భార్య (30)
భవ్యశ్రీ, కూతురు (15),
లోకేశ్, కొడుకు (12)
బిట్టు వెంకటేశ్, స్రవంతి తండ్రి (55)
రాజమణి, స్రవంతి తల్లి (50)
రెక్కలే ఆస్తిగా ఉన్నంతలో ఉన్నతంగా, అంతకుమించి సంతోషంతో బతుకుతున్న కుటుంబంపై విధికి అసూయ పుట్టినట్టుంది! దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న ఆ కుటుంబాన్ని కారు ప్రమాదం మృత్యువు రూపంలో కబళించింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. భర్త, భార్య, కొడుకు, కూతురు, వెంట వెళ్లిన అత్త, మామనూ జల సమాధి చేసింది. సిద్ధిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం మునిగడప గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి కాల్వలోకి పల్టీ కొట్టిన ప్రమాదంలో బీబీనగర్కు చెందిన బొల్లు సమ్మయ్య కుటుంబం జల సమాధి అయ్యింది. పదిహేనేండ్లలోపు ఇద్దరు పిల్లలు కూడా ఊపిరాడక పసిప్రాయంలోనే అసువులు బాసారు. భార్యతో కలిసి స్టీల్ సామాన్లు అమ్మి జీవనాన్ని సాగించే సమ్మయ్య సోమవారం భార్యాపిల్లలు, అత్తమామతో కలిసి వేములవాడ రాజన్న ఆలయానికి బయల్దేరారు.
దర్శనం అనంతరం నిద్ర చేసి బుధవారం తిరిగి ఇంటికి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నది. కారు తిరుగల పడడం, డోర్లు తెరుచుకోకపోవడంతో బురద నీటిలో మునిగి సమ్మయ్య, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, అత్త అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. తీవ్రంగా గాయపడిన సమ్మయ్య మామ, బొమ్మల రామారం మండలం మల్యాల గ్రామానికి చెందిన వెంకటేశ్ను హైదరాబాద్లోని గాంధీ దవాఖానకు తరలించగా, ఆయన కూడా మృతిచెందారు. దేవుడి దగ్గరికి వెళ్లివస్తూ కుటుంబం మొత్తం కన్నుమూయడంతో బీబీనగర్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాలను బీబీనగర్కు తరలించాలని సిద్దిపేట కలెక్టర్ పీజేపాటిల్ అక్కడి అధికారులకు సూచించారు.
-బీబీనగర్, జనవరి 10
బీబీనగర్, జనవరి 10 : రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తమ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ వేములవాడ రాజన్న ఆలయానికి వెళ్లిన కుటుంబ సభ్యులు దైవ దర్శనం అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం మునిగడప గ్రామ సమీపంలో జరిగిన ప్రమాదంలో మృత్యు పాలయ్యారు. కారులో మొత్తం ఆరుగురు వెళ్లగా అందులో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు.
నిరుపేద స్థాయి నుంచి..
బీబీనగర్ మండల కేంద్రానికి చెందిన బొల్లు సమ్మయ్య(38) గ్రామాలు తిరుగుతూ స్టీల్ సామాన్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడి వివాహం 17 ఏండ్ల క్రితం బొమ్మల రామారం మండలం మల్యాల గ్రామానికి చెందిన స్రవంతి(30)తో జరిగింది. వారికి కూతురు భవ్యశ్రీ(15) కొడుకు లోకేశ్(12) ఉన్నారు. మండల కేంద్రంలోనే ఉంటూ పిల్లలను స్థానిక ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నారు. లోకేశ్ 5వ తరగతి, భవ్యశ్రీ 7వ తరగతి చదువుతున్నది. భార్యా భర్తలిద్దరూ స్టీల్ సామాన్లు విక్రయిస్తూ వచ్చిన దానితో సంతృప్తిగా జీవనం సాగిస్తున్నారు.
అత్తా, మామలతో కలిసి దైవదర్శనానికి
బొల్లు సమ్మయ్య భార్య, కూతురు, కుమారుడితో పాటు అత్త రాజమణి(50), మామ బిట్టు వెంకటేశం(55)తో కలిసి తన కారులో సోమవారం మధ్యాహ్నం వేములవాడకు బయల్దేరి వెళ్లారు. రాత్రి అక్కడికి చేరుకున్న వారు దైవ దర్శనం అనంతరం అక్కడే బస చేశారు. మంగళవారం ఉదయం కారులో సొంతూరికి బయల్దేరారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం మునిగడప గ్రామ సమీపంలోని ఎల్లమ్మ దేవాలయం వద్ద ఉన్న కొండపోచమ్మ సాగర్ పంపింగ్ కల్వర్టును కారు బలంగా డీకొని పక్కనే ఉన్న కాల్వ గుంతలో బోల్తాకొట్టింది. గుంతలో బురద ఉండటంతో పాటు కారు రివర్స్లో పడడంతో డోర్లు తెరుచుకోలేక, అందులో నుంచి బయటకు రాలేక బురద నీటిలో కూరుకు పోయారు. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి కారులో ఉన్న వారిని బయటికి తీసేలోగా బురద నీటిని మింగిన సమ్మయ్య, భార్య స్రవంతి, పిల్లలు లోకేశ్, భవ్యశ్రీతో పాటు అత్త రాజమణి మృతి చెందారు. కొన ఊపిరితో ఉన్న మామ బిట్టు వెంటేశ్ను హైదరాబాద్ గాంధీ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు.
రెండు కుటుంబాల్లో విషాదం
ప్రమాదంలో మండల కేంద్రానికి చెందిన సమ్మయ్య కుటుంబ సభ్యులతో పాటు బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామానికి చెందిన బిట్టు వెంకటేశ్ దంపతులు కూడా మృతి చెందారు. దాంతో వారి కుటుంబాలు ఈ షాక్ నుంచి కోలుకోలేక పోతున్నాయి. సమ్మయ్య కుటుంబ సభ్యులందరూ మృతి చెందడంతో బంధువులు, సన్నిహితులు కన్నీరు మున్నీరవుతున్నారు. గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉండే సమ్మయ్య మృత్యు ఒడికి చేరడంతో చుట్టుపక్కల వారితో పాటు తెలిసిన వారు కూడా అతడి ఇంటికి వచ్చి కన్నీరు పెట్టుకుంటున్నారు. దైవ దర్శనానికి కూతురు అల్లుడు వెళ్తుండడంతో వారికి తోడుగా వెళ్లేందుకు వచ్చిన బిట్టు వెంకటేశ్ దంపతులు కూడా మృతి చెందగా వారి గ్రామంలో సైతం విషాద ఛాయలు నెలకొన్నాయి.
మల్యాల గ్రామంలో విషాదం
సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ వద్ద కారు కాల్వలో పడిన ప్రమాదంలో బిట్టు వెంకటేశం, బిట్టు రాజమణి మృతి చెందడంతో వారి స్వగ్రామం బొమ్మలరామారం మండలంలోని మల్యాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వెంకటేశం కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉండగా.. కుమారుడు హైదరాబాద్లోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. పెద్దకుతూరు కూతుర్ల పెండ్లిళ్లు చేశారు. పెద్దకూతురు బొల్లు స్రవంతి, అల్లుడు సమ్మయ్య పిలుపు మేరకు వారు ఆదివారం బీబీనగర్కు వెళ్లారు. అనంతరం కూతురితో కలిసి వేములవాడ రాజన్న దైర్శనం కోసం వెళ్లి ఊహించని ప్రమాదంతో మృత్యుపాలయ్యారు. అందరితో కలుపుగోలుగా ఉండే రాజమణి, వెంకటేశ్ మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.