దామరచర్ల, ఫిబ్రవరి 16 : దక్షిణ కాశీగా పేరుగాంచిన వాడపల్లి పుణ్యక్షేత్రం నాటి సమైక్య పాలనలో అభివృద్ధికి నోచుకోలేదు. 2004లో వచ్చిన పుష్కరాలకు అప్పటి పాలకులు మొక్కుబడిగా రెండు పుష్కరఘాట్లు మాత్రమే ఏర్పాటు చేశారు. భక్తులకు అనుగుణంగా వసతులు కూడా కల్పించలేదు. తెలంగాణ ఏర్పాటు అనంతరం కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 2016లో వచ్చిన కృష్ణా పుష్కరాలకు వాడపల్లిలో కృష్ణా, మూసీ నదుల సంగమంతో పాటు రెండు నదులకు అనువుగా ఉన్న ప్రాంతాల్లో సుమారు రూ.15 కోట్లతో 8 పుష్కరఘాట్లు నిర్మించారు. దీంతోపాటు శివాలయం వద్ద రూ.10 లక్షలతో మండపం, రూ.8 లక్షలతో షెడ్లు, రూ.10లక్షలతో లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వద్ద మండపం, భక్తులకు మంచినీరు అందించేందుకు ఆర్ఓ ప్లాంటు ఏర్పాటు చేశారు. ఆలయాల వద్ద పార్కు, గ్రీనరీలను, ఆలయాలకు చేరుకునేందుకు రెండు కోట్లతో సీసీ రోడ్లు, డివైడర్లను ఏర్పాటు చేశారు. విద్యుదీకరణ చేపట్టారు. మరుగుదొడ్ల సదుపాయం కల్పించారు. దీంతో ఇక్కడికి భక్తుల రాక భారీగా పెరిగింది.
మేళ్లచెర్వు శివాలయానికి మహర్దశ
మేళ్లచెర్వు, ఫిబ్రవరి 16 : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పిలువబడే ప్రాచీన చరిత్ర ఉన్న మేళ్లచెర్వు స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయం స్వరాష్ట్రంలో దేదీప్యమానంగా వెలుగొందుతున్నది. స్థానిక సిమెంట్ పరిశ్రమలు, దాతల సహకారంతో నాలుగు వైపులా రాజగోపురం నిర్మాణ పనులు చేపట్టారు. మినరల్ ఫండ్ నిధులతో ఆలయం లోపలి భాగంలో షెడ్లు, కల్యాణ మండపం అభివృద్ధి చేశారు. దాత కొంకపాక వేంకటేశ్వరశర్మ నిర్మించిన అన్నదాన భవనం ఇటీవల ప్రారంభమైంది. నాలుగేండ్లుగా పలు అభివృద్ధి పనులు జరిగాయి. ఈ ఏడాది జాతర నిమిత్తం ప్రభుత్వం రూ.50 లక్షల ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేయగా.. ఆలయం చుట్టూ సీసీ నిర్మాణం, బారికేడ్లు, షెడ్లు, చలువ పందిళ్లు, ప్రహరీ చుట్టూ ఫ్లడ్ లైట్లు, జనరేటర్ ఏర్పాటు పనులు చేపట్టారు. ఐదు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్న మహాశివరాత్రి వేడుకలకు శంభులింగేశ్వరుడి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
సుందరంగా సోమేశ్వరాలయం
రామగిరి, ఫిబ్రవరి 16తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు పానగల్లోని పురాతన చాయా సోమేశ్వరాలయం అభివృద్ధికి నోచుకోలేదు. గతంలో ఇక్కడ ఎలాంటి వసతులూ లేవు. స్వరాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్న సర్కారు.. కృష్ణా పుష్కరాల సందర్భంగా సోమేశ్వరాలయానికి రూ.2కోట్లు కేటాయించింది. ఆ నిధులతో ఆలయం ఎదురుగా ఉన్న కోనేరును అత్యంత సుందరంగా తీర్చిదిద్ది మెట్లు నిర్మించారు. పానగల్-నకిరేకల్ రోడ్డు నుంచి దేవాలయం వరకు రహదారిని పునరుద్ధరించారు. ఆర్కియాలజీ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో దేవాలయంలో కెమికల్ ట్రీట్మెంట్ చేశారు. పురాతన ఆలయాల అభివృద్ధి కమిటీ, రుద్రసేన ట్రస్టు, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి ఆధ్వర్యంలో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. దీంతో భక్తుల సంఖ్య పెరిగింది.