మోటకొండూర్, నవంబర్ 25 : ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయలతో ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేస్తున్నది. మెరుగైన వైద్య సేవల కల్పనలో భాగంగా రాష్ట్రంలో శిశువు జన్మించిన నాటి నుంచి అవసరమయ్యే వ్యాక్సిన్లను ప్రభుత్వం ఉచితంగా అందిస్తూ అండగా ఉంటుంది. ఈ క్రమంలో భాగంగా తాజాగా 10-16 ఏండ్ల పిల్లలు ధనుర్వాతం (టెటానస్), కంఠసర్పి (డిప్తీరియా) భారిన పడకుండా ఉచితంగా టీడీ వ్యాక్సిన్ పంపిణీ చేసింది.
మోటకొండూర్ మండలంలో వైద్య సిబ్బంది ఈ నెల 7 నుంచి 19వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వెళ్లి 10-16 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సిన్ వేశారు. మండలంలో 22 ప్రభుత్వ పాఠశాలలు, 2 ప్రైవేటు పాఠశాలల్లో మొత్తం 431మంది 10-16 ఏండ్ల వయస్సు గల పిల్లలు ఉండగా వైద్య సిబ్బంది అందరికీ వ్యాక్సిన్ వేశారు. అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో చదివే 10 నుంచి 16 ఏండ్ల విద్యార్థులకు టీడీ వ్యాక్సినేషన్ కోసం మండల వ్యాప్తంగా ఆరుగురు ఏఎన్ఎంలు, 25 మంది ఆశలతో మొత్తం 31 మంది సిబ్బందిని నియమించారు. పక్కా ప్రణాళికతో నిర్ణీత తేదీల్లో ఆయా పాఠశాలలో టీడీ వ్యాక్సినేషన్ పూర్తి చేశారు.
మండల వ్యాప్తంగా టీడీ వ్యాక్సినేషన్ను 431 మంది పిల్లలకు గాను అందరికీ వ్యాక్సిన్ వేశాం. 10-16 ఏండ్ల వారికి వేసేందుకు పిల్లల తల్లిదండ్రులు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయుల సహకారంతోనే ఈ టాస్క్ను వంద శాతం విజయవంతంగా పూర్తి చేశాం. మొదటగా వ్యాక్సిన్పై పిల్లలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడంతో వ్యాక్సినేషన్ విజయవంతం అయింది.
– రాజేందర్నాయక్, మండల వైద్యాధికారి