నల్లగొండ ప్రతినిధి, జనవరి5(నమస్తే తెలంగాణ) : త్వరలో జరుగనున్న నల్లగొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గ్రాడ్యుయేట్స్కు పరీక్షగానే మారింది. అర్హత కలిగిన పట్టభద్రులంతా ఉప ఎన్నికల్లో ఓటు వేయాలనుకుంటే తప్పనిసరిగా ఓటును కొత్తగా నమోదు చేయించుకోవాల్సిందే. పాత జాబితాలో తమ ఓటు ఉంది కాబట్టి ఓటు వేస్తామంటే కుదరదు.
కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నిక జరిగిన ప్రతిసారి పట్టభద్రులంతా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే. అందుకు గత నెల 30 నుంచి ఓటు నమోదు కార్యక్రమానికి ఎన్నికల సంఘం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వచ్చే నెల 6వ తేదీ వరకు తుది గడువు విధించింది. దాంతో అర్హులైన పట్టభద్రులంతా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచిస్తున్నది. పల్లా రాజేశ్వర్రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానపట్టభద్రులకు పరీక్ష.
సారించింది. 2027 మార్చి 29వ తేదీ వరకు మిగిలిన పదవీ కాలం కోసం జరుగనున్న ఉప ఎన్నిక కోసం కసరత్తు మొదలైంది. అందులో భాగంగా తొలి అంకమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు ప్రాధాన్యతనిస్తూ ఓటు నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గత నెల 30వ తేదీన పబ్లిక్ నోటీసు జారీ చేస్తూ అదే రోజు నుంచి ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించింది. నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ నియోజకవర్గ ఓటరు నమోదు అధికారిగా వ్యవహరిస్తున్నారు.
వచ్చే నెల 6వ తేదీ వరకు ఫారం-18ద్వారా ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. 2023 నవంబర్ 1 నాటికి డిగ్రీ పూర్తై మూడేండ్లు నిండిన వారందరూ దరఖాస్తుకు అర్హులుగా నిర్దేశించారు. వచ్చే నెల 6వ తేదీ నాటికి వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించిన అనంతరం అదే నెల 21న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తారు. ఈ జాబితాపై మార్చి 14 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. చివరగా అభ్యంతరాలను పరిష్కరించిన అనంతరం ఏప్రిల్ 4వ తేదీన తుది ఓటర్ల జాబితా పూర్తి చేయాల్సి ఉంది. తుది ఓటర్ల జాబితా రూపకల్పన అనంతరం ఏ క్షణమైనా ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఏప్రిల్ చివరలో లేదా మే మొదటి వారంలో ఎన్నిక పూర్తి కావచ్చని అంచనా. జూన్ 8వ తేదీ లోపు ఉప ఎన్నిక పూర్తికి కేంద్ర ఎన్నికల సంఘం గడువు విధించింది.
సాధారణ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో ఒకసారి ఓటు నమోదు చేసుకుంటే సరిపోతుంది. కానీ పట్టభద్రుల ఎన్నికల్లో అలా కుదరదు. ఎన్నిక జరిగిన ప్రతిసారి గ్రాడ్యుయేట్ కొత్తగా ఓటుహక్కు నమోదు చేయించుకోవాల్సిందే. 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో ఓటు వేసాము కాబట్టి అదే జాబితాతో ఓటు వేస్తామంటే అవకాశం లేదు. అందుకే ఓటుకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తాజాగా ఓటు కోసం దరఖాస్తు చేయాలని అధికార యంత్రాంగం సూచిస్తున్నది. వాస్తవంగా 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 5,05,565 మంది ఓటర్లుగా నమోదయ్యారు.
2015 మార్చిలో జరిగిన ఎన్నికల్లో 2,81,138 మంది ఓటర్లుగా ఉన్నారు. 2015తో పోలిస్తే 2021 మార్చి నాటికి 22,4427 మంది అదనంగా ఓటర్లు చేరారు. ప్రస్తుతం ఉప ఎన్నిక కావడంతో ఏ మేరకు ఓటర్ల నమోదు జరుగుతుందనే వేచి చూడాలి. గత ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఓటరు నమోదు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. దాంతో పెద్ద ఎత్తున ఓటర్ల నమోదు జరిగిందనేది స్పష్టం. ఉప ఎన్నిక కావడంతో ఈ సారి ఇప్పటికైతే అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఉప ఎన్నికపై రాజకీయ పార్టీలు, పోటీ చేయాలనుకునే ఆశావహులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సంక్రాంతి తర్వాత ఓటర్ల నమోదు ఊపందుకోవచ్చన్నది అంచనా.