లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు
స్వామి ఖజానాకు రూ.12,03,848
యాదాద్రి, మే 6 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పరమ పవిత్రంగా జరిగే సేవలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. అనంతరం ఊయలలో శయనింపు చేసి గంట పాటు వివిధ రకాల పాటలు పాడి కొనియాడారు. తెల్లవారుజాము 3గంటల నుంచి పూజలు మొదలయ్యాయి. నిజాభిషేకంతో ఆరాధించి ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు.
4గంటలకు ఆలయాన్ని తెరిచి సుప్రభాతం నిర్వహించారు. బిందెతీర్థం నిర్వహించి స్వామిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం స్వామికి నిజాభిషేకం, సహస్రనామార్చన చేశారు. స్వయంభువుల ప్రధానాలయంలోని ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విడతలుగా రూ.600 టికెట్ తీసుకున్న భక్తులకు సువర్ణ పుష్పార్చన చేశారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. తొలుత శ్రీమన్యుసూక్త పారాయ ణం చేశారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చించారు. స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సుల్లో కొండపైకి చేరుకుని స్వయంభువులను దర్శించుకున్నారు. పాతగుట్ట ఆలయంలో స్వామి ఆర్జిత సేవలు ఘనంగా నిర్వహించారు. శ్రీవారి ఖజానాకు రూ. 12,03,848 ఆదాయం వచ్చినట్లు ఆలయాధికారులు తెలిపారు.