రామగిరి, ఏప్రిల్ 9 : నల్లగొండ జిల్లా కవులు, కళాకారులు, సాహితీవేత్తలకు పుట్టినిల్లు అని ప్రముఖ సాహితీవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత కూరెళ్ల విఠలాచార్య అన్నారు. జిల్లా సాహిత్యం, కవిత్వంపై ఇంకా పరిశోధనలు అవసరమని, ఆ దిశగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. క్రోధి నామ సంవత్సరం ఉగాది సందర్భంగా సాహితీమేఖల సంస్థ ఆధ్వర్యంలో నల్లగొండలోని ఎస్బీఆర్ గార్డెన్స్లో మంగళవారం కవి సమ్మేళనం, ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట నీలగిరి కవుల చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నల్లగొండ జిల్లా సాహిత్యం, కవిత్వంపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితిలో పున్న అంజయ్య కవుల చరిత్ర రాయడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రముఖ కవి మేరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు. అనంతరం వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందిస్తున్న వారికి పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ కవులు తమ రచనల ద్వారా సమాజాన్ని చైతన్యం చేయాలన్నారు. పురస్కారాలు అందుకున్న వారిలో సుందర దేశికుల్, మునాస్ వెంకట్, భూతం ముత్యాలు, స్కైబాబా, రావిరాల నర్సయ్య, పెన్నా మోహనశర్మ, కొండోజు నవీన్కుమార్, చిన్నారి గుర్రం వేఘన ఉన్నారు. కార్యక్రమంలో జాతీయ సినిమా విమర్శ అవార్డు గ్రహీత ఎం.పురుషోత్తమాచార్యులు, సాహితీ మేఖల సంస్థ ప్రధాన కార్యదర్శి పున్న అంజయ్య, చండూరు సాహితీ మేఖల వ్యవహారకర్త మంచుకొండ చిన భిక్షమయ్య, గందూరి లక్ష్మీనారాయణ, బైరెడ్డి కృష్ణారెడ్డి, అద్దంకి లక్ష్మయ్య, బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.