రామగిరి, మార్చి 19 : పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగను గురువారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అర్చకులు పం చాంగ శ్రావణం కార్యక్రమం నిర్వహించారు. వాడవాడల్లో ఉగాదిని వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామునుంచే భక్తులు పలు ఆలయాలకు వచ్చి దైవ దర్శ నం చేసుకున్నారు. ముఖ్యంగా యువతీ, యుకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని ఆలయాల్లో పంచాంగ విశేషాలను భక్తులకు వివరించారు.
పండుగ వేడుకల్లో భాగంగా నల్లగొండ పట్టణంలో రెండో భద్రాద్రిగా పేరుగాంచిన రామగిరిలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. సాయం త్రం పంచంగ శ్రవణం నిర్వహించగా అధిక సంఖ్యలో భక్తులు, ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే వీటీ కాలనీలోని శ్రీదేవి, భూదేవి సహిత శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం, తులసీనగర్లోని శ్రీభక్తాంజనేయస్వామి ఆలయం, పాతబస్తీలోని శ్రీ సంతోషిమా ఆలయం, బ్రహ్మంగారి గుట్టపై ఉన్న ఆలయంతోపాటు పానగల్లోని సోమేశ్వరాలయాల్లో భక్తులు పూజలు చేశారు. విశ్వకర్మ భవన్లో విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ సిద్ధాంతి బేతోజు సత్యనారాయణ పంచాగాన్ని ఆవిష్కరించి, పంచాగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో, వివిధ ప్రాంతాత్లో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు.
యాదగిరిగుట్ట, మార్చి19: పరాభవ నామసంవత్సరంలో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఖర్చు గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నదని దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు, ప్రధాన పురోహితులు గౌరీభట్ల సత్యనారాయణ శర్మ, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వేంకటాచార్యులు వివరించారు. స్వామివారిది స్వాతి నక్షత్రం, తులారాశి కావడంతో పరాభవ నామసంవత్సరంలో ఆదాయం 05, వ్యయం 14 ఉందన్నారు. ఆండాళ్ అమ్మవారిది అశ్విని నక్షత్రం, మేషరాశి కావడంతో ఆదాయం 11, వ్యయం 05 ఉంటుందన్నారు. గురువారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గుట్ట ప్రధానాలయంలో స్వామివారి,అమ్మవారిని దివ్య మనోహరంగా అలంకరించి సేవను తిరుమాడవీధుల్లో ఊరేగించారు. తూర్పు మాడ వీధుల్లో పంచాంగ శ్రవణం నిర్వహించారు.
ఆదాయం తక్కువగా ఉండి, ఖర్చు ఎక్కువగా ఉండటంతో స్వామివారి ఖర్చు ఈఏడాది గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు. ఆండాళ్ అమ్మవారికి ఈ ఏడాది ఆదాయం గణయంగా పెరిగి, ఖర్చు స్వల్పంగా ఉండబోతుందన్నారు. అమ్మవారి అనుగ్రహం ఉంటే సకల సంపదలు కలుగుతాయన్నారు. గతేడాది కంటే ఈ ఏడాదిలో స్వామివారి ప్రధానాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయన్నారు. పరాభవ నామ సంవత్సరంలో అహంకారం, స్త్రీలోలత్వం, మోసం చేయడం తగదన్నారు. భగవంతుడి అనుగ్రహం ఉంటే ఈ ఏడాది అన్ని శుభాలే జరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త. నరసింహమూర్తి, ఈవో భవానీ శంకర్, డీఈవో దోర్బల భాస్కర్ శర్మ, ప్రధానార్చకులు కాండూరి వేంకటాచార్యులు, భట్టర్ సురేంద్రాచార్యులు ఆలయ అధికారులు, అర్చకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

రామగిరి, మార్చి 19: ప్రకృతి పానీయాలు సేవిద్దాం – కృత్రిమ పానీయాలు మానేద్దామని కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ప్రకృతిలో జరిగే మార్పులను ఉగాది పండుగ సూచిస్తుందని, ఇది రుతు ఆగమనానికి చిహ్నమని అన్నారు. పరాభవ నామ తెలుగు నూతన సంవత్స ఉగాదిని పురస్కరించుకుని టీఎస్యూటీఎఫ్, జనవిజ్ఞాన వేదిక నల్లగొండ జిల్లా కమిటి ఆధ్వర్యంలో గడియారం సెంటర్లో గురువారం ‘ప్రకృతి పానీయాలు సేవిద్దాం – శీతల పానీయాలు మనేద్దాం’ అనే నినాదంతో ఆయన ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతిలో లభించే కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ వంటివి ఎండాకాలంలో శరీరాన్ని చల్లబరిచి ఆరోగ్యాన్ని కాపాడతాయన్నారు. ఉగాది పచ్చడిలో ఉండే షడ్రుచులకు సంబంధించిన పదార్థాలు మనిషి ఆర్యోగానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. మేయర్ బుర్రి చైతన్య మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యం చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జేవీవీ రాష్ర్ట కార్యదర్శి నన్నూరి వెంకటరమణరెడ్డి , డీఎస్పీ శివరాంరెడ్డి, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్రెడ్డి, జిలా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, మాజీ మున్సిపల్ల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, సీఐలు ఏమిరెడ్డి రాజశేఖర్రెడ్డి, జేవీవీ రాష్ట్ర బాధ్యులు వద్దిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, జిల్లా కార్యదర్శులు నల్లపరాజు వెంకన్న, గేర నరసింహ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నల్లగొండ పట్టణంలో సాయంత్రం టీఎస్యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో యూటీఎస్, తెలంగాణ సాహితీ నల్లగొండ జిల్లా కమిటీ సంయుక్తంగా నిర్వహించిన సామాజిక కవి సమ్మేళనంలో భారీ సంఖ్యలో కవులు పాల్గొన్నారు. కార్యక్రమంలో డా.పగడాల నాగేందర్, సాగర్ల సత్తయ్య, తరుణోజు భీష్మాచారి, మోత్కూరి శ్రీనివాస్, చింతపల్లి రవీందర్, పలు సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.