– మూడు తులాల బంగారం, రెండు సెల్ఫోన్లు, బైక్ స్వాదీనం
– వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి
నీలగిరి, మే 15 : చైన్ స్నాచింగ్కు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుండి మూడు తులాల బంగారం, రెండు సెల్ఫోన్లు, బైక్ స్వాదీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి తెలిపారు. శనివారం నల్లగొండ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. తిప్పర్తి మండలంలోని ఎర్రగడ్డలగూడెం గ్రామంలో చింతల సత్తమ్మ(70 ) అనే వృద్ధురాలు గ్రామ కేంద్రంలో మర్రిచెట్టు కింద కూర్చోని ఉండగా ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి మెడలోని చైన్ ను గుంజుకుని పారిపోయినట్లు ఫిర్యాదు అందిందన్నారు. దీంతో ఎస్పీ ఆదేశాల మేరకు సీసీఎస్ సీఐ జితేందర్రెడ్డి, తిప్పర్తి ఎస్ఐ శంకర్తో పోలీస్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. సాంకేతికత సాయంతో నిందితులను గుర్తించి శనివారం ఉదయం తిప్పర్తి మండల కేంద్రంలో పట్టుకున్నట్లు వెల్లడించారు. నిందితులను నకిరేకల్కు చెందిన బాణాల హరిప్రసాద్, అతడి చిన్నమ్మ కొడుకు మైనర్ బాలుడిగా గుర్తించినట్లు తెలిపారు.
ఎర్రగడ్డలగూడెంలో వృద్ధురాలి మెడలో చైన్ స్నాచింగ్కు పాల్పడి మిర్యాలగూడకు అమ్మేందుకు వెళ్తున్నట్లు తెలిసిందన్నారు. దీంతో మైనర్ బాలుడిని జూనైల్ కోర్టుకు, హరిప్రసాద్ను కోర్టుకు తరలించినట్లు తెలిపారు. ఎండాకాలంలో ఆరుబయట నగలు ధరించి నిద్రించవద్దని, ఇంట్లో బంగారం నిల్వ చేయకుండా బ్యాంకులు లేదా లాకర్లలో ఉంచుకోవాలని సూచించారు. గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తిప్పర్తి ఎస్ఐ శంకర్, సీసీఎస్ సిబ్బంది, తిప్పర్తి పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.