తిప్పర్తి, మే 13 : ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురి వద్ద డబ్బులు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులను నల్లగొండ జిల్లా తిప్పర్తి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. తిప్పర్తి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శివరాం రెడ్డి వివరాలు వెల్లడించారు. నల్లగొండ పట్టణంలోని పద్మానగర్కు చెందిన మహమ్మద్ నజీర్ (ఏ1), నల్లగొండ పట్టణంలోని ఓల్డ్ సిటీకి చెందిన గాజుల జ్యోతి (ఏ2) కొంతకాలంగా నిరుద్యోగ మహిళలకు జిల్లా కోర్టులో కాంట్రాక్ట్ స్వీపర్, అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుండి రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20 వేల చొప్పున వసూలు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో తిప్పర్తి మండలం ఇండ్లూరుకు చెందిన ఏపూరి హెప్సిబా అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టగా పలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు.
తిప్పర్తి, మాడుగులపల్లి, నల్లగొండ మండలాలకు చెందిన మొత్తం 31 మంది బాధితుల నుండి రూ.10.32 లక్షలను వసూలు చేసినట్లుగా తేలిందన్నారు. వీరిపైన తిప్పర్తి పోలీస్ స్టేషన్లో 4, నల్లగొండ వన్ టౌన్ లో 3 కేసులు నమోదైనట్లు చెప్పారు. నిందితుల వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్, రూ.10 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసును ఎస్పీ శరత్చంద్ర ఆదేశాల మేరకు త్వరితగతిన చేదించిన శాలిగౌరారం సీఐ కొండల్, ఎస్ఐ సాయి ప్రశాంత్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి, రామ్ రెడ్డి, పోలీస్ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది సతీశ్, రాజీవ్, సురేశ్ పాల్గొన్నారు.