‘స్వరాష్ట్రంలో తుంగతుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో ప్రగతి సాధించింది. అభివృద్ధి నిలిచింది. నాడు నీళ్లు లేక కరువుఛాయలు అలుముకున్న ప్రాంతం కాళేశ్వరం జలాల పుణ్యమా అని సస్యశ్యామలమయ్యింది. నాడు హత్యలు, కొట్లాటలకు నిలయమైన ఈ ప్రాంతం ఇప్పుడు ప్రశాంత వాతావరణం సంతరించుకున్నది. తొమ్మిదేండ్లలో దశాబ్దాలుగా జరుగని ఎన్నో పనులు చేశాం. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం. సీఎం కేసీఆర్, ప్రజల అండతో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. మరింత అభివృద్ధికి ప్రజలు మరోసారి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నా దేహంలోని ప్రతి కణం, ప్రతి క్షణం నాడు తెలంగాణ ఉద్యమం కోసమే కొట్లాడాను..నేడు తుంగతుర్తికి అంకితం’ అని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు.
– సూర్యాపేట, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ)
నమస్తే : మూడోసారి టికెట్ రావడం ఎలా అనిపిస్తుంది..?
ఎమ్మెల్యే : తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలోనే సాయం కోసం ప్రభుత్వం వైపు దీనంగా చూసే వారిపై సీఎం కేసీఆర్కు పూర్తి అవగాహన ఉన్నది. అలాటి వారికి ఏ సంక్షేమ పథకాలు ఇవ్వాలి, ప్రాంతాల వారీగా ఎక్కడ ఎలాంటి అభివృద్ధి చేయాలి అనే దానిపై కసరత్తు చేసి నేడు అమలు చేస్తున్నారు. ఎన్నికల బరిలో దిగిన వారిలో అత్యధిక శాతం ఉద్యమం నుంచి వచ్చిన వారమే. సీఎం కేసీఆర్ ఆశయాల మేరకు పని చేస్తూ అభివృద్ధిలో ప్రజల భాగస్వాములను చేస్తూ ముందుకు సాగుతున్న వారికి ఆయన ఏదో ఒక రీతిన తగిన గౌరవం ఇస్తున్నారు. అదే మాదిరిగా వెనుకబడిన తుంగతుర్తిలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నందుకు నాకు మూడో సారి అవకాశం ఇచ్చారని భావిస్తున్నా.
నమస్తే : తొమ్మిదేండ్లలో మీరు చేసిన పనులు?
ఎమ్మెల్యే : తొమ్మిదేండ్ల కాలంలో తుంగతుర్తికి మీరు సాధించిందేమిటి అని నన్ను కాదు, ప్రజల్ని అడిగితే సరైన సమాధానం వస్తుంది. నాడు గుంతల రోడ్లు, బీడుబారిన భూములు, వలస బతుకులు, హత్యా రాజకీయాలు.. అలాంటి ప్రాంతం నేడు సస్యశ్యామలమైంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో సిరుల పంటలు పండుతున్నాయి. 2014కు ముందు లక్షన్నర మెట్రిక్ టన్నులకు మించి ధాన్యం పండకపోగా నేడు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తున్నది. గురుకుల పాఠశాలలు జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ కావడం, వంద పడకల ఆసుపత్రి, దేవాలయాల అభివృద్ధి, చెక్ డ్యామ్, బ్రిడ్జిల నిర్మాణాలు, రహదారులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. దశాబ్దాలుగా కాని పనులు ఈ తొమ్మిదేండ్లలోనే జరిగింది.
నమస్తే : నియోజకవర్గంలో బీఆర్ఎస్ పరిస్థితి… టికెట్ ప్రకటనతో స్పందన ఎలా ఉంది?
ఎమ్మెల్యే : మామూలుగానే ఉద్యమం నాటి నుంచి పార్టీకి కేడర్ ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పార్టీ మరింత బలోపేతం అయ్యింది. అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ వైపు జనం ఉన్నారు. నాకు మూడోసారి టికెట్ వచ్చిందని తెలియగానే పార్టీ శ్రేణులు, ప్రజలు నియోజకవర్గ వ్యాప్తంగా సంతోషం వ్యక్తం చేశారు. ర్యాలీలు తీసి పటాకులు కాల్చి స్వీట్లు పంచుకోవడం చూసి నేనే ఆశ్చర్యపోయాను. సాధారణంగా రాజకీయ నాయకులు, కార్యకర్తలు వేడుకల్లో పాల్గొంటారు. కానీ లబ్ధిదారులు రోడ్లపైకి వచ్చి హర్షం వ్యక్తం చేయడం సంతోషాన్ని కలిగించింది.
నమస్తే : మీ నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీల పరిస్థితేమిటి?
ఎమ్మెల్యే : రాజకీయ నాయకులకు జనం కావాలి.. జనానికి అభివృద్ధి కావాలి.. అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ వైపు జనం ఉండడంతో నేడు నియోజకవర్గంలోని అన్ని పార్టీలు దాదాపు ఖాళీ అయ్యాయి. అలా అని ఇతర పార్టీలు అసలే లేవనను. కానీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో చేపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధితో నన్ను ఢీ కొట్టేంత స్థాయిలో ఎవరూ లేరు. ఇతర పార్టీలు జనంలోకి వచ్చేందుకు గతంలో ఆయా పార్టీలు చేసింది చూపించుకునేందుకు స్మారక స్థూపాలు తప్ప మరేమీ లేవు. నియోజకవర్గంలో ఏదో కొత్తగా చేస్తామని చెప్పుకునేందుకు మా ప్రభుత్వం ఏం మిగల్చ లేదు. ఎప్పటికప్పుడు కోట్లాది నిధులు వస్తుండగా ఉన్న కొద్దిపాటి సమస్యల్లో ఇటీవల జరిగిన మీటింగ్లో మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలు కూడా కార్యరూపం దాల్చాయి. దాంతో ప్రతిపక్ష పార్టీలకు ఈ నియోజకవర్గంలో స్థానం లేదు.
నమస్తే : హ్యాట్రిక్ విజయం కోసం ప్రజలకు ఏం చెబుతారు..?
ఎమ్మెల్యే : తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధి స్థిరీకరించబడాలి. సంక్షేమం కొనసాగాలి. ప్రజలు మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండాలి అనుకుంటున్నారు. తదనుగుణంగా తుంగతుర్తిలో నేనే ఎమ్మెల్యే కావాలని ఆకాంక్షిస్తున్నారు. గత తొమ్మిది సంవత్సరాల శ్రమ, ఓ విజన్తో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పర్చువేషన్, తుంగతుర్తిపై మంత్రి జగదీశ్రెడ్డికి ఉన్న అభిమానంతో జరిగిన అభివృద్ధిని, గత పరిస్థితిని ప్రజలు బేరీజు వేసుకోవాలి. 10 సంవత్సరాల్లో తుంగతుర్తిపై పూర్తి పట్టు సాధించాను. ఒక్క చిన్న అవినీతి, అక్రమం, ఎలిగేషన్ కూడా నాపై లేదు. హత్యా రాజకీయాలు లేవు. ప్రతిపక్షాలపై ఒక్క కేసు మోపలేదు. నాకు వేరే వ్యాపకాలు లేవు. నేను పాలనను ఎంజాయ్ చేస్తాను.
నమస్తే : రానున్న ఎన్నికల్లో మీ ఆయుధం ఏంటి?
ఎమ్మెల్యే : ఆయుధం అంటేనే తుంగతుర్తి ప్రజలకు పాత రోజులు గుర్తుకు వస్తాయి. మామూలుగా ఏదైనా పని విజయవంతం అయ్యేందుకు కావాల్సిన బలాన్నే ఆయుధం అంటాం. కానీ ఈ పదం నేడు తుంగతుర్తికి నచ్చదు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటున్న జనానికి ఆయుధం అనకుండా తాము చేస్తున్న పనులను కొనసాగిస్తూ మరింత అభివృద్ధి చేస్తాం. యువకుడైన నాకు తుంగతుర్తిలో అవకాశం వస్తే రెండు సార్లు గెలిపించారు. తొలి సారి తెలంగాణ వాదం గెలిపిస్తే రెండో సారి ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి గెలిపించింది. ఇక ఈ సారి సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమమే గెలిపిస్తుంది. ప్రజలు నన్ను దీవించి మరోసారి భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా.