నల్లగొండ సిటీ, సెప్టెంబర్ 1: రాఖీ పండుగ టీఎస్ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. నల్లగొండ రీజియన్ పరిధిలో 30,31 తేదీల్లో ప్రత్యేక బస్సు సర్వీసులు నడపడంతో గురువారం ఒక్క రోజే రూ.1.75 కోట్ల ఆదాయం వచ్చింది. ఆర్టీసీ చరిత్రలో రాష్ట్రంలోనే ఆల్ టైమ్ రికార్డ్ అని ఆర్ఎం శ్రీదేవి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం డిపోలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు. నల్లగొండ రీజియన్లో మొట్ట మొదటి సారిగా రికార్డ్ స్థాయిలో 2.83 లక్షల కిలో మీటర్లు తిరిగి 105 శాతం ఓఆర్ (ఆక్యూపెన్సీ రేషియా)తో రూ.1.75 కోట్ల ఆదాయం రావడంతో రాష్ట్రంలో నల్లగొండ ప్రథమ స్థానంలో నిలిచినట్లు చెప్పారు. గతేడాది రాఖీకి రూ.1. 50 కోట్లు రాగా ఈఏడాది దాని అధిగమించి మరో రూ. 25 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. అత్యధికంగా నల్లగొండ డిపో రూ.36. 43 లక్షల ఆదాయం సమకూరి ముందంజలో ఉందన్నారు. మిగతా రోజుల్లో రోజుకు రీజియన్ వ్యాప్తంగా 7 డిపోల పరిధిలో రూ.75 లక్షల ఆదాయం సమకూరుతుండగా ఈనెల 31న ఆదాయం రెండింత లు పెరిగినట్లు వివరించారు.
ఆర్టీసీ మహిళలకు గిఫ్ట్ కూపన్లు పెట్టడంతో మంచి ఆదరణ కనిపించింది. ఈసారి ఎక్కువ మంది ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణించారు.అనంతరం ఆర్ఎం శ్రీదేవి సంస్థ ఉద్యోగులకు అభినందనలు తెలిపి స్వీట్లు పంపిణీ చేశారు.