సరుకు రవాణాలో కార్గో మార్క్
హోం డెలివరీ సేవలతో ప్రజలకు మరింత చేరువైన ఆర్టీసీ
రెండేండ్లలో 5.40 కోట్ల ఆదాయం
ప్రైవేట్కు దీటుగా వేగంగా రవాణా
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ
నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీకి చేయూతనిచ్చి లాభాల బాటలో నడిపించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆలోచన సత్ఫలితాలను ఇస్తున్నది. ప్రజా రవాణా వ్యవస్థలో విశేష సేవలందిస్తున్న ఆర్టీసీ సరుకు రవాణాలోనూ విజయవంతంగా ముందుకు సాగుతున్నది. కార్గో పార్సిల్ సర్వీస్ ద్వారా ప్రైవేట్ కొరియర్ సర్వీసుల కంటే వేగంగా ప్రజలకు చేరువైంది. రెండేండ్లలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 7 డిపోల పరిధిలో 13 కౌంటర్లు, 26 ప్రైవేట్ ఏజెంట్ కౌంటర్ల ద్వారా ఆర్టీసీకి రూ.5.40కోట్ల ఆదాయం సమకూరింది. మామిడి పండ్ల నుంచి ప్రముఖ దేవస్థానాల ప్రసాదాల వరకు అన్నింటినీ తక్కువ ధరలో సరఫరా చేస్తూ జనం ఆదరణ పొందుతున్నది.
సూర్యాపేట, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రధాన రవాణా సౌకర్యం అయిన ఆర్టీసీ సరుకుల రవాణాతోనూ గుర్తింపు తెచ్చుకున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 19, 2020న ప్రారంభించిన ఆర్టీసీ పార్సిల్, కార్గో సర్వీస్ సేవలు విజయవంతంగా రెండేండ్లు పూర్తి చేసుకున్నది. ప్రైవేట్ కొరియర్ సర్వీసుల కంటే వేగంగా కార్గోసేవలు ప్రజలకు అందుతుండడంతో రోజురోజుకు కార్గోకు ఆదరణ పెరుగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఆర్టీసీ బస్సులు వెళ్లే దేశంలోని పలు ప్రాంతాలకు ఈ సేవలు అందుతున్నాయి. ప్రజలకు సత్వర సేవలు అందడమే కాకుండా ఆర్టీసీకి ఆదాయం గణనీయంగా పెరుగుతున్నది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఆర్టీసీలో ప్రజా రవాణాకు అనుకూలంగా లేని బస్సులను సరుకు రవాణాకు ఉపయోగించడంతోపాటు మరో 4 భారీ వాహనాలను సరుకు, పార్సిల్ రవాణాకు వాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలోని 7 డిపోల పరిధిలో 13 ఆర్టీసీతోపాటు 26 ప్రైవేట్ ఏజెంట్ కేంద్రాలను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. సరుకుల రవాణాతో మంచి ఫలితాలను సాధిస్తున్నది.
పలువురికి ఉపాధి
ఆర్టీసీ ప్రారంభించిన కార్గో, పార్సిల్ సర్వీసుతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలువురికి ఉపాధి లభిస్తున్నది. బస్సు వెళ్లే ప్రతి గ్రామానికీ కార్గో, పార్సిల్ సర్వీసు సేవలు అందాలనే ఉద్దేశంతో ఆయా మండలాల్లో ప్రైవేట్ వ్యక్తులకు కమీషన్ బేసిస్లో ఏజెన్సీలు ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 26 మందికి ఏజెన్సీలు అప్పగించారు. పట్టణాల్లో రూ.5వేలు, మండలాల్లో రూ.వెయ్యి డిపాజిట్ చేయించుకొని నిబంధనల మేరకు అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే పార్సిళ్లను వినియోగదారులకు అందజేయడం, గ్రామాల నుంచి పార్సిళ్లను బుక్ చేయడం ద్వారా రెండు రకాలుగా కమీషన్ ప్రైవేట్ ఏజెన్సీలకు అందుతున్నది.
ఇంటికే పండ్లు, ప్రసాదాలు
ఏ కొరియర్ సర్వీసులు అందించనటువంటి సేవలను ఆర్టీసీ ప్రజలకు చౌకగా చేపడుతున్నది. ఎవరికైనా మామిడి పండ్లు కావాలంటే టీఎస్ఆర్టీసీ వెబ్సైట్లోకి వెళ్లి బుక్ చేస్తే నేరుగా ఇంటికే మామిడిపండ్లు పంపిస్తున్నది. దీంతోపాటు దేవుళ్లకు మొక్కుల చెల్లింపులు, ప్రసాదాలు కూడా ఆన్లైన్ ద్వారా బుక్ చేస్తే నేరుగా ఇంటికే పంపించే ఏర్పాటు చేసింది. మేడారం సమ్మక్కసారలమ్మ జాతర సందర్భంగా భక్తులు ఆర్టీసీ వెబ్సైట్లో బుక్ చేయగా సంస్థ సిబ్బంది అమ్మవారికి చెల్లింపులు చేసి బంగారం(బెల్లం) ఇంటికి పంపించారు. అలాగే భద్రాచలం రామచంద్రస్వామి కల్యాణోత్సవానికి సంబంధించిన తలంబ్రాలను ఆన్లైన్ ద్వారా రూ.80 చెల్లిస్తే కార్గో, పార్సిల్ సేవలద్వారా ఇంటికి పంపించారు.
తక్కువ చార్జీలు
ఆర్టీసీకి దాదాపు 80శాతానికి పైనే ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉండడంతో కొరియర్ సర్వీసు అయినా గంటల వ్యవధిలోనే గమ్య స్థానాలకు చేర్చుతున్నారు. ప్రైవేట్ కొరియర్ సర్వీసులతో పోల్చుకుంటే చార్జీలు చాలా తక్కువ. 100 కిలోల మామిడి పండ్లను సూర్యాపేట నుంచి హైదరాబాద్కు పంపించాలంటే ఆర్టీసీ కార్గోలో రూ.60 తీసుకుంటుండగా ప్రైవేట్ కొరియర్ సర్వీసుల్లో రూ.130 నుంచి 150 వరకు ఉంది. పార్సిల్ కవర్ను ఆర్టీసీలో పంపిస్తే రూ.40 ఉండగా ప్రైవేట్లో రూ.50 తీసుకుంటున్నారు. ప్రైవేట్లో అయితే రెండో రోజు గమ్యస్థానానికి చేరుకుంటుండగా ఆర్టీసీలో అదే రోజు గంటల వ్యవధిలోనే అందుతున్నది.
రెండేండ్లలో 4,96,012 పార్సిల్
ఆర్టీసీ ఏర్పాటు చేసిన కార్గో సేవలు రెండేండ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నది. ఇప్పటివరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4,96,012 పార్సిల్, కవర్ బుకింగ్ ద్వారా రూ.5.18 కోట్లు, 264 కార్గో ట్రిప్ల ద్వారా రూ.22.9 లక్షల ఆదాయం సమకూరింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే నల్లగొండ జిల్లాలో 3,09,018 పార్సిల్, 47 కార్గో.. సూర్యాపేటలో 1,57,771 పార్సిల్, 161 కార్గో.. యాదాద్రి భువనగిరి జిల్లాలో 26,223 పార్సిల్, 56 కార్గో సరుకులను గమ్య స్థానాలకు చేర్చారు. ఆర్టీసీ కార్గో ప్రైవేట్ సర్వీసుల కంటే వేగంగా సేవలందిస్తుండడంతో ప్రజలు వినియోగించుకుంటున్నారు.
రూ.5.40 కోట్ల ఆదాయం
కార్గో సర్వీసులు ప్రారంభించిన రెండేండ్లలో ఉమ్మడి జిల్లా పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి నుంచి రూ.5,40,62,830 ఆదాయం సమకూరింది. వీటిల్లో నల్లగొండ జిల్లాలో రూ.3,28,95,490, సూర్యాపేటలో రూ.1,82,000,70, యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ.29,67,270 వచ్చింది.
బస్సు వెళ్లే ప్రతిచోటా కార్గో, పార్సిల్ సర్వీసు
ఆర్టీసీ బస్సులు వెళ్లే ప్రతిచోటా కార్గో, పార్సిల్ సర్వీసు ఉండేలా చర్యలు చేపడుతున్నాం. ప్రైవేట్ కంటే చాలా స్పీడుగా సేవలందిస్తున్నాం. పార్సిల్ పంపిన అదేరోజు డెలివరీ జరుగుతుంది. సరుకు రవాణాతో ప్రజలకు ఆర్టీసీ మరింత చేరువైంది. సంస్థకు కూడా ఆదాయం సమకూరుతున్నది. ప్రారంభంలో ఉన్న సమస్యలు పూర్తిగా పరిష్కరించగలిగాం.
– బుర్రి కృపాకర్రెడ్డి, కార్గో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, ఉమ్మడి నల్లగొండ జిల్లా