మిర్యాలగూడ రూరల్, మార్చి 29 : బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథా నాయకులని, వారి కృషి ఫలితమే నేతలకు పదవులని రాష్ట్ర విద్య, సంక్షేమం మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ (టీఎస్ఈడబ్ల్యూడీసీ) చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి అన్నారు. మిర్యాలగూడ పట్టణ శివారు నందిపహాడ్లో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అధ్యక్షతన బుధవారం 19 గ్రామ పంచాయతీల నాయకులతో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, పేద వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి చర్చించుకోవడంతోపాటు పార్టీ కార్యకర్తలందరూ ఆత్మీయంగా కలుసుకొని సాధక బాధకాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని ఆదేశించారన్నారు. వచ్చే ఎన్నికల కోసం కార్యకర్తలందరూ ఇప్పటి నుంచే కార్యొన్ముఖులు కావాలని సూచించారు. ప్రతిపక్షాలు చేసే అసత్య కూతలకు సరైన సమాధానం చెప్పాలని, వారి కుట్రలను పటాపంచలు చేయాలని అన్నారు. గ్రామ అభివృద్ధి పనుల ప్రగతిపై సర్పంచులు ప్రగతి నివేదిక తయారు చేసుకొని కార్యకర్తలకు వివరించి ఇంటింటికీ ప్రచారం చేయాలని సూచించారు. ఈ ఏడాది వరుసగా ఎన్నికలు రానున్నాయని పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని పిలుపునిచ్చారు. భాస్కర్రావును మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు.
దేశంలోని రైతులను రాజు చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారన్నారు. తెలంగాణలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు తమకూ కావాలని అన్ని రాష్ర్టాల రైతులు కోరుకుంటున్నారని తెలిపారు. రైతుల డిమాండ్లు నెరవేరాలంటే దేశంలో బీఆర్ఎస్ బలపడాలని, రాష్ట్రంలో భారీ మెజార్టీతో మళ్లీ అధికారంలోకి రావాలని, అన్ని పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచే విధంగా కృషి చేయాలని అన్నారు. అప్పుడే బడుగు, బలహీన వర్గాలతోపాటు రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం బీఆర్ఎస్ కార్యకర్తలు చురుకుగా పని చేయాలని సూచించారు. 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. తాను ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి పని చేస్తానన్నారు. ప్రతిపక్ష నాయకుల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం శ్రీధర్రెడ్డిని సన్మానించారు. పలువురికి మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను అందచేశారు. కార్యక్రమంలో ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నాగార్జునాచారి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వెంకటరమణ చౌదరి, నాయకులు చిట్టిబాబు నాయక్, తిరుపతమ్మ, ఏడుకొండలు, భిక్షంగౌడ్, సిద్దార్థ, రాజయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.