నకిరేకల్, ఫిబ్రవరి 1 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గడపగడపకూ అందుతున్నాయని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం ఆయన సమక్షంలో నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో పలు పార్టీలకు చెందిన 50మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో ప్రజలకు భరోసా కలుగుతున్నదన్నారు. మన రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు సైతం మన పథకాలు ఆదర్శంగా తీసుకుంటున్నారని తెలిపారు.
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన వారిలో గంధమల్ల సంజయ్, సందీప్, శ్రీనాథ్, పెరుమాళ్ల నరేశ్, పట్టేటి నరేశ్, నగేశ్, సైదులు, సింగం మహేశ్, గంధమల్ల స్వప్న, భారతమ్మ, వసంత, సంధ్య, జానకమ్మ, వినోద ఉన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు యల్లపురెడ్డి సైదిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నోముల కేశవరాజు, నాయకులు పెండెం సదానందం, దైద పరమేశం, కౌన్సిలర్లు, పాల్గొన్నారు.
అన్నదానానికి రూ.50వేల విరాళం
నకిరేకల్ పట్టణంలోని శ్రీ మద్భగవద్గీత మందిరంలో నిర్వహిస్తున్న 25వ రజతోత్సవ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బుధవారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు అన్నదాన కార్యక్రమానికి రూ.50వేలు విరాళం అందించారు.