రామగిరి, మే 23 : తెలంగాణలో రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశానికి మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గురువారం 79 కేంద్రాల్లో సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో నిర్వహించిన టీఎస్ ఎడ్సెట్ – 2024 సజావుగా సాగింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో నాలుగు ఆన్లైన్ కేంద్రాల్లో ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 4గంటల వరకు పరీక్ష నిర్వహించారు.
మొత్తం 1100 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా.. 998 మంది హాజరయ్యారు. 102 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు నిర్వాహకులు వెల్లడించారు. నల్లగొండలోని ఎస్పీఆర్ పాఠశాల ప్రాంగణంలోని డీపీఎంఎస్ ఆన్లైన్ కేంద్రంలో పరీక్షలను టీఎస్ ఎడ్సెట్ ప్రత్యేక పరిశీలకుడు, నల్లగొండ డీవీఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వైస్ ప్రిన్సిపాల్ బొడ్డుపల్లి రామకృష్ణ పర్యవేక్షణ చేశారు. ఆయన వెంట చీఫ్ సూపరింటెండెంట్ నీలంరెడ్డి ఉన్నారు.
సూర్యాపేట శ్రీవేంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల కేంద్రంలో పరీక్షలను టీఎస్ ఎడ్సెట్ పరిశీలకుడు, నల్లగొండ డీవీఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ బి.నారాయణరెడ్డి, కోదాడలోని సనా ఇంజినీరింగ్ కళాశాల కేంద్రంలో సూర్యాపేటలోని ఆర్కేఎల్కే బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ ఇందుర్తి రజిని, మధిర ఇంజినీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రంలో పరిశీలకుడు సైదులు పర్యవేక్షణ చేశారు. నల్లగొండలో ఒక విద్యార్థి 15 నిమిషాలు ఆలస్యంగా రావడంతో పరీక్ష కేంద్రంలోకి అధికారులు అనుమతించలేదు. నల్లగొండలో 360 మంది విద్యార్థులకుగాను 331 మంది హాజరయ్యారు. 29 మంది గైర్హాజరయ్యారు. సూర్యాపేటలో 400 మందికిగాను 367 మంది హాజరు కాగా, 33మంది గైర్హా జరయ్యారు. కోదాడలో 340 మందికిగానూ 300 మంది హాజరయ్యారు. 40 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.