చండూర్, అక్టోబర్ 26 : మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపు ఖాయమైనట్లేనని, భారీ మెజారిటీతో పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలునిచ్చారు. బుధవారం మండల పరిధిలోని బోడంగిపర్తి గ్రామంలో ఇంటింటికీ తిరిగి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2018 ఎన్నికల్లో మునుగోడు ప్రజలంతా నమ్మి ఓట్లేసి గెలిపించిన రాజగోపాల్రెడ్డి ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీకి తాకట్టుపెట్టి బీజేపీలో చేరాడన్నారు. మరోమారు మునుగోడు ప్రజలను మోసం చేసేందుకు బీజేపీ రూపంలో వస్తున్నాడని, ఇక్కడి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇప్పటికే మునుగొడులో రాజగోపాల్రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్న గ్రామాల్లో అడుగడుగునా అడ్డుకుంటున్నారన్నారు. పలుచోట్ల ప్రజలు నిలదీస్తుండటంతో సమాధానం చెప్పలేక పారిపోతున్న సంఘటనలు చూస్తున్నామన్నారు. ఇక కాంగ్రెస్ పరిస్థితి చచ్చిన పాములా తయారైందని పేర్కొన్నారు. ఆ పార్టీని మునుగోడు ప్రజలు మరిచిపోయారన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి అత్యధిక మెజార్టీ కట్టబెట్టి సీఎం కేసీఆర్కు కానుకగా ఇద్దామని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సత్తయ్య, నాయకులు భిక్షం, యాదయ్య, భిక్షం, మహేశ్, చారి, రాజేశ్ పాల్గొన్నారు.